ముగిసిన తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన
తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. జిల్లాల వారీగా అర్హత కలిగిన నామినేషన్ల వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. విజయనగరం మినహా 12 జిల్లాల్లోని 3వేల 249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 18వేల 168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 32వేల 502 వార్డుల్లో 77వేల 554 మంది పోటీ చేయడానికి అర్హత సాధించారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం కనపర్తి, దాసరివారిపాలెం పంచాయతీలకు కోర్టు స్టే అమలులో ఉంది.
మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి, వార్డు సభ్యుల స్థానాలకు దాఖలైన మొత్తం నామినేషన్లలో అర్హత లేనివి 3వేల 568 ఉన్నాయని ఎన్నికల అధికారులు తేల్చారు. సర్పంచి స్థానాలకు సంబంధించి 1,323 వార్డు సభ్యుల్లో 2వేల 245 నామినేషన్లను పలు కారణాలతో తిరస్కరించారు. తిరస్కరించిన నామినేషన్లపై కొందరు చేసుకున్న అప్పీళ్లను ఆర్డీవోలు పరిష్కరించనున్నారు. రేపు నామినేషన్ల ఉపసంహరణతో పాటు పోటీల్లో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు.
ఇక రెండో దశ పంచాయతీ ఎన్నికలకు తొలిరోజు సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు 7వేల 170 నామినేషన్లు దాఖలయ్యాయి. 13 జిల్లాల్లో సర్పంచి స్థానాలకు 2వేల 619.. వార్డు సభ్యుల స్థానాలకు 6వేల 561 మంది నామినేషన్లు వేశారు. రెండో దఫాలో 3వేల 335 సర్పంచి, 33వేల 632 వార్డు సభ్యుల స్థానాల్లో ఈనెల 13న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 4 సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com