ఆ ఊళ్లో పాలు ఫ్రీ.. ఏ ఇంటికి వెళ్లినా ఉచితంగా..

ఆ ఊళ్లో పాలు ఫ్రీ.. ఏ ఇంటికి వెళ్లినా ఉచితంగా..
ఇంట్లో వాడుకుని అడిగిన వారికి ఉచితంగా ఇస్తారు. గ్రామస్తులు పాలు అమ్మడాన్ని పాపంగా పరిగణిస్తారు.

కలికాలం.. అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది.. ఆనపకాయ నుంచి కూరలో వేసుకునే కరివేపాకు దాకా. మా చిన్నప్పుడు అన్నీ అందరి ఇళ్లలో కాసేవి.. ఒకరికొకరం ఇచ్చుకునేవాళ్లం. ఇప్పుడు ప్రతిదానికి పైసలే. పైసల్లేందే పనైతలేదు. ఇక పాలు అయితే చెప్పక్కర్లేదు.. మంచి పాలు మచ్చుకైనా దొరకట్లేదు. ఇక గేదె పాలు ఎక్కడినుంచి తేవాలి. కానీ ఆ ఊళ్లోకి వెళితే అందరూ ఉచితంగా పాలు పోస్తారు ఎన్ని కావాలంటే అన్నీ.. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు ఉన్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. తరాలుగా వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తున్నామంటున్నారు కర్నూలు జిల్లా గంజహళ్లి, కడిమెట్ల గ్రామస్థులు.

ఊళ్లో నాలుగు వందలకు పైగానే పశువులు ఉన్నాయి. రోజుకు ఐదారు వందల లీటర్ల పాలు ఇస్తాయి. కానీ ఏ రోజు పాలు అమ్మాలని చూడరు. ఇంట్లో వాడుకుని అడిగిన వారికి ఉచితంగా ఇస్తారు. హోటల్ నిర్వాహకులు కూడా పక్కనే ఉన్న గోనెగండ్ల, ఎమ్మిగనూరు ప్రాంతాల నుంచి పాలు తెచ్చుకుంటారు. 400 ఏళ్లుగా ఇదే ఆచారం కొనసాగుతోంది. గ్రామస్తులు పాలు అమ్మడాన్ని పాపంగా పరిగణిస్తారు. పొరపాటున అమ్మితే ఏదైనా కీడు జరుగుతుందనే అనుమానం వారిని పాలు అమ్మనివ్వదు. ఇలా పాలు అమ్మకపోవడానికి తాత బడేసాబ్ కారణమని ఒక కథ ప్రచారంలో ఉంటే, మరికొందరు ఊరి దేవుడు చెన్నకేశవ స్వామి అని అంటారు. బడేసాబ్ తాత 1667లో సజీవ సమాధి అయ్యారు. ఆ రోజుల్లో ఊళ్లో ఉన్న పశువులకు అంతు చిక్కని వ్యాధి సోకిందట. అప్పుడు కొన్ని ఆవులు, గేదెలు మ‌త్యువాత పడ్డాయి. కొన్ని పశువులు పాలివ్వడం మానేశాయి. ఊళ్లో ఉన్న బడేసాబ్ తాతకు పాలు తాగాలనిపించి కొడుకు హుస్సేన్ సాహెబ్‌ను పాలు తీసుకురమ్మని ఊరిలోకి పంపించాడు. పాలు లేవని ఎవ్వరూ పోయలేదు.

చివరకు గ్రామ పెద్ద దగ్గరికి వెళ్లి అడగగా పాలిచ్చే ఆవు మరణిస్తే ఆ కళేబరాన్ని మారెమ్మ ఆలయం వద్ద పడేశామని చెప్పాడట. దాంతో హుస్సేన్ వెళ్లి మారెమ్మ దేవతని ప్రార్థించాడట. అతడి ప్రార్థనకు ప్రసన్నురాలైన తల్లి మీ తండ్రి నామాన్ని ఉచ్చరిస్తూ ఆవును లేపు అని చెప్పిందట. దాంతో హుస్సేన్ మరణించిన ఆవు దగ్గరకు వెళ్లి.. బాబాబోలీ దూద్‌దేవ్ అని అన్నాడట. ఆ మాటలకు ఆవు లేచి అతడికి పాలు ఇచ్చిందట. దాంతో జనం అంతా బడేసాబ్ దగ్గరకు వెళ్లి పశువులు మరణించకుండా ఉండేందుకు మార్గం చెప్పమని అడగ్గా ఇకపై ఊళ్లో ఎవరూ పాలు అమ్మరాదని, పశువులను చంపకూడదని, పశుగ్రాసాన్ని తగుల బెట్టరాదని సూచించారట. అప్పటి నుంచి ఊరి జనం అదే ఆచరిస్తూ వస్తున్నారు. ఎవరైనా ఊరి మాటను, కట్టుబాటును థిక్కరిస్తే వారి ఇంట్లో ఏదో ఒక అనర్థం జరుగుతుంది. అందుకే ఆ ఊళ్లో పాలు అమ్మే సాహసం ఎవరూ చేయరు. ఆవులు, బర్రెలు ఈనితే చెన్నకేశవ స్వామికి నైవేద్యంగా పెడతారు. తరువాత వాడుకుంటారు. మళ్లీ వాళ్లు రోజూ పాలు తాగుతారా అంటే అదీ లేదు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం మాత్రమే పాలు తాగుతారు. అడిగిన వారికి ఉచితంగా పోస్తారు.

Tags

Read MoreRead Less
Next Story