ముగిసిన అమరావతి మహిళా రైతు జేఏసీ ఢిల్లీ టూర్

ముగిసిన అమరావతి మహిళా రైతు జేఏసీ ఢిల్లీ టూర్

అమరావతి మహిళా రైతు జేఏసీ ఢిల్లీ టూర్ ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన ఈ టూర్‌లో మహిళా రైతు జేఏసీ నేతలు వివిధ పార్టీల నేతలు, ఎంపీలను కలిసి అమరావతికి మద్దతు కూడగట్టారు. పలు జాతీయ పార్టీల నేతల నుంచి సానుకూల స్పందన లభించిందని మహిళా జేఏసీ నేతలు తెలిపారు. అమరావతి అంశం పార్లమెంట్‌లో చర్చకు వస్తే కచ్చితంగా అమరావతికి మద్దతు ఇస్తామని దాదాపు అన్ని జాతీయ రాజకీయ పార్టీల నేతలు భరోసా ఇచ్చారు.

ఇవాళ కేంద్ర సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రాందాస్‌ అథవాలేని కలిశారు. రాజధాని అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు జేఏసీ నేతలు. వారి ఆవేదన విన్న మంత్రి సానుకూలంగా స్పందించారు. రాజధాని విషయంలో రైతుల డిమాండ్‌ న్యాయమైందే అన్నారు. రాజధానిగా అమరావతికే తన మద్దతు ఉంటుందని.. ఈ అంశంపై సీఎం జగన్‌కు లేఖ రాస్తానని హామి ఇచ్చారని జేఏసీ నేతలు వెల్లడించారు.

మూడు రోజుల పర్యటనలో మహిళా జేఏసీ నేతలు కాంగ్రెస్ చీప్ విప్‌ని, సీపీఐ నేత రాజా, సీపీఎం నేత సీతారాం ఏచూరీ, శివసేన ఎంపీ అరవింద్ సావంత్, మురళీధర్, కనిమొళి వంటి నేతలను కలిసి అమరావతికి జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. రాజధాని అమరావతిగా ఉండేలా సహకరించాలంటూ కోరారు. మహిళా రైతు జేఏసీ నేతల గోడు విన్న నేతలు మద్దతు ఇవ్వడానికి సానుకూలంగా స్పందించారు.

Tags

Read MoreRead Less
Next Story