AP News: రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారపర్వం

AP News:  రాష్ట్రంలో కొనసాగుతున్న ఎన్నికల  ప్రచారపర్వం
జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ

జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ విపక్ష కూటమి అభ్యర్థులు ఎన్నికల ప్రచారపర్వం కొనసాగిస్తున్నారు. ఇంటింటికీ కరపత్రాలు పంచుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. తమను గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తామని హామీ ఇస్తున్నారు.

నెల్లూరులో 42వ డివిజన్‌లో మాజీ మంత్రి నారాయణ ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే స్థానిక సమస్యలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఉదయగిరిలో తెదేపా జెండా రెపరెపలాడిస్తామని... ఆ పార్టీ అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. దుత్తలూరులో కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యకర్తలను వేధించిన వారి లెక్కలు తేలుస్తామని హెచ్చరించారు. అవినీతిరహితంగా కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని తెదేపా నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి ప్రకటించారు. కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వేమిరెడ్డి దంపతులను... శ్రేణులకు నేతలు పరిచయం చేశారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర ఇందులో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు 31వ డివిజన్‌లో తెదేపా అభ్యర్థి దామచర్ల జనార్థన్‌ ప్రచారం చేశారు. ఓటర్లను కలిసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.

తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం,జనసేన,భాజపా ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్‌ ప్రచార భేరి మోగించారు. 3పార్టీల కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు తెదేపా కార్యకర్తలను పరిచయం చేశారు. కోరుమామిడి, తాడిమళ్ల, కానూరు, నడుపల్లి కోట, కానూరు అగ్రహారంలో దుర్గేష్ ఓట్లు అభ్యర్థించారు. గోపాలపురం నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు ప్రచారం చేయగా గ్రామాల్లో మహిళలు హారతులు పట్టారు. మంచి పాలన కోసం కూటమిని గెలిపించాలని మద్దిపాటి ఓటర్లను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి కూటమి అభ్యర్థి మంతెన రామరాజు ..మహాదేవపట్నంలో ప్రచారం చేశారు. స్థానికులు పూలతో ఆయనకు స్వాగతం పలికారు.

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం చందకచర్లలో కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ ప్రచారం చేశారు. ఇంటింటికీ సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంచారు. చందకచర్లకు చెందిన వైకాపా సర్పంచ్ ప్రభావతి భాయ్, అగలి మాజీ జడ్పీటీసీ రామకృష్ణ యాదవ్.. అనుచరులతో కలిసి తెదేపాలో చేరారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం మైలా సముద్రం, నారేపల్లి గ్రామాల్లో కూటమి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి ప్రచారం చేశారు. మహిళలు , వృద్ధులు ఆమెకు స్వాగతం పలికారు. అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు.

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుచానూరులో వైకాపాకు చెందిన 100 కుటుంబాలు తెలుగుదేశంలో చేరాయి. తెదేపా అభ్యర్థి పులి వర్తి నాని వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్‌ పాలనలో అరాచకాలు, భూ దందాలు భరించలేక ఆ పార్టీని శ్రేణులు వీడుతున్నాయని నాని అన్నారు. పార్వతీపురం నియోజకవర్గం సీతానగరానికి చెందిన వైకాపా కార్యకర్తలు భారీగా తెదేపాలో చేరారు.

Tags

Read MoreRead Less
Next Story