ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఎట్టకేలకు స్పందించిన సర్కార్‌

ఏపీలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఎట్టకేలకు స్పందించిన సర్కార్‌

YS Jagan Mohan Reddy ( File photo)

ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం కేసులో సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది సర్కార్‌.

ఏపీలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడులతో ఎట్టకేలకు ప్రభుత్వం అప్రమత్తమైంది. దాదాపు ప్రతిరోజూ ఏదో ఒక చోట దాడి ఘటన జరుగుతుండటంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం కేసులో సిట్‌ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. సెప్టెంబరు నుంచి జరిగిన విగ్రహాల ధ్వంసం కేసులను ఈ బృందం దర్యాప్తు చేయనుంది. మరోవైపు అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు వేసి, పర్యవేక్షణ చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది.

హిందూదేవాలయాలపై వరుసగా దాడులు జరిపిన నిందితులను అరెస్ట్‌ చేయడం కాదు కదా.. కనీసం వాటిని అరికట్టే చర్యలు కూడా తీసుకోలేదు. దీంతో ప్రతిపక్షాలు, హిందూ సంఘాలు గొంతెత్తాయి. పైగా ప్రతిపక్షాల కుట్రేనంటూ మంత్రులు ఆరోపణలు చేశారు. ఈ మొత్తం వ్యవహారం కేంద్రం దృష్టికి కూడా చేరింది. దీంతో ఎట్టకేలకు జగన్‌ సర్కార్‌ స్పందించింది. దాడులను అడ్డుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి నిరోధక శాఖ ఏడీ అశోక్‌ కుమార్‌ సారథ్యంలో 16 మంది అధికారులతో సిట్‌ ఏర్పాటైంది. సెప్టెంబరు నుంచి జరిగిన విగ్రహాల ధ్వంసం కేసును సిట్‌ దర్యాప్తు చేయనుంది. దర్యాప్తు చేసి.. కోర్టులో చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలని సిట్‌ను ప్రభుత్వం ఆదేశించింది.

ఇక సిట్‌తోపాటు అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు వేసి, పర్యవేక్షణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం సచివాలయంలో మత సామరస్య కమిటీ సమావేశం జరగింది. మంత్రులు బొత్స, మేకతోటి సుచరిత, వెల్లంపల్లి, అంజాద్‌ బాషా, వివిధ మతాల ప్రతినిధులు భేటీ అయ్యారు. జిల్లాల స్థాయిలో అన్ని మతాల ప్రతినిధులతో కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జన సంచారంలేని ఆలయాలపై దాడులు చేసి ప్రజల్లో అలజడి సృష్టించడానికి కుట్ర జరుగుతుందని మంత్రి బొత్స ఆరోపించారు.

ప్రశాంతంగా ఉండే ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై దాడుల ఘటనలు అగ్గి రాజేస్తున్నాయి. ఈ ఆంశం రాజకీయ రంగు పులుముకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాలు పరస్పరం వాగ్బాణాలు సంధిస్తున్నాయి. సాధారణంగా గుప్తనిధుల అన్వేషణ, ఆభరణాల చోరీ, విగ్రహాల స్మగ్లింగ్‌ కోసం దేవాలయాలపై దాడులు జరుగుతుంటాయి. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. అయితే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు అలాంటివి కాదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లుగా ఉందని కొన్ని ధార్మిక సంస్థలు చెబుతున్నాయి. గతేడాది జనవరిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో పలు హిందూ దేవుళ్లు, దేవతల విగ్రహాల ధ్వంసంతో మొదలై విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం వరకూ దాదాపు 150 ఘటనలు ఏపీలో జరిగాయి. నెల్లూరులో ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయ రథం, అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి రథాలు దగ్ధం కావడం, విజయవాడలో కనకదుర్గ అమ్మవారి రథం వెండి సింహాలు మాయం ఘటనలు ప్రజల్లో ఆందోళన పెంచాయి.

రాష్ట్రంలో ఆలయాల దాడులపై ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు, బీజేపీ, జనసేన పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసంతో ఈ రాజకీయ రగడ మరింత ముదిరింది. టీడీపీ అధినేత చంద్రబాబు.. పోలీసుల అడ్డంకుల మధ్య రామతీర్థం పర్యటన చేయడం, బీజేపీ నేతల పర్యటనను పోలీసులు అడ్డుకోవటంతో ఆందోళనలు మరింత పెరిగాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహారావు తదితరులని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. తెర వెనుక ఉన్నదెవరు? ఆలయాలపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు చేయిస్తున్నారు? వంటి ప్రశ్నలకు దర్యాప్తు సంస్థల వద్ద సమాధానం లేదు. రామతీర్థం ఆలయంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసం ఘటనలో.. స్వామి ఒంటి మీది వెండి ఆభరణాల జోలికి పోలేదు. రాష్ట్రంలో ధ్వంసానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న ఎన్నెన్నో ఉదంతాల్లో జరిగింది ఇదే. దీన్ని బట్టి ఈ పనులు చేస్తున్నవారి ఉద్దేశం సుస్పష్టంగా కనిపిస్తోందని భక్తులు, హిందూ సంఘాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇన్ని జరుగుతున్నా నిందితులను పట్టుకోకపోవడం మరిన్ని ఘటనలు జరిగేందుకు కారణమవుతుందన్న విమర్శలున్నాయి.

అంతర్వేది ఘటన తర్వాత అన్ని ఆలయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని దేవాదాయశాఖ, పోలీసు శాఖ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. కొన్ని ఆలయాల్లో ఈ సౌకర్యం సమకూర్చినా చాలా ఆలయాలు నేటికీ సీసీ కెమెరాల నిఘాకు దూరంగా ఉన్నాయి. తాజా పరిమాణాలపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీసు కమిషనర్‌లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్, విజిబుల్ పోలీసింగ్​కు ఆదేశించారు. ప్రతి ఒక్క దేవాలయాలన్ని జియో ట్యాగింగ్ చేయటంతో పాటు సీసీ కెమెరాల ఏర్పాటు మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్తామన్నారు. ఆలయాలపై దాడుల ఘటనలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినా.. విగ్రహాల విధ్వంసం కొనసాగుతుండటంతో భక్తుల్లో ఆందోళన నెలకొంటోంది. బాధ్యులను త్వరితగతిన గుర్తించి.. ఘటనల వెనుక ఉన్నదెవరో కనిపెట్టాలని వారు కోరుతున్నారు.


Tags

Read MoreRead Less
Next Story