Maha Padayatra : మహాపాదయాత్రకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
Maha Padayatra : అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. మహాపాదయాత్రకు అనుమతించాలంటూ అమరావతి పరిరక్షణ సమితి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ను విచారించిన ధర్మాసనం.. పాదయాత్రకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు గత అర్ధరాత్రే.. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరించారు ఏపీ పోలీసులు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందంటూ డీజీపీ ఉత్తర్వులు ఇచ్చారు.
రైతుల పాదయాత్రకు అనుమతిస్తూ.. సీరియస్ కామెంట్స్ చేసింది హైకోర్టు. వేలమందితో రాజకీయ నాయకులు పాదయాత్ర చేయవచ్చు గాని.. 600 మంది రైతులు పాదయాత్ర చేపట్టకూడదా అని ధర్మాసనం ప్రశ్నించింది. అసలు రైతుల పాదయాత్రకు ఎందుకు బందోబస్తు ఇవ్వలేరని పోలీసు శాఖను ప్రశ్నించింది హైకోర్టు. జోడో యాత్ర రాష్ట్రాల మీదుగా జరుగుతుంటే వాళ్లకి అనుమతిచ్చారని, ఢిల్లీలో వేలాది మంది రైతులు తమ సమస్యలపై ర్యాలీలు చేస్తున్నారని, ఇలా మిగతా రాష్ట్రాల్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్న విషయాన్ని హైకోర్టు ప్రస్తావించింది. 35వేల మంది రైతులలో 600 మంది పాదయాత్ర చేస్తుంటే ఎందుకు బందోబస్తు చేయలేరని హైకోర్టు ప్రశ్నించింది.
అమరావతి రైతుల పాదయాత్రలో 600 మంది పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పాదయాత్ర ముగింపు రోజు.. అంటే మహాసభకు ముందురోజే అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి నవంబర్ 11వ తేదీ వరకు అమరావతి రైతులు పాదయాత్రకు ప్లాన్ చేశారు. మొత్తం 900 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరగనుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com