ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
స్పీకర్‌,డిప్యూటీ సీఎం, ఎంపీలు చేసిన వ్యాఖ్యలపైనా హైకోర్టులో విచారణ జరిగింది.

ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతారాంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించాయని, కోర్టులపై దాడిగానే వీటిని పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది.. సోషల్‌ మీడియాలో వ్యాఖ్యలు, స్పీకర్‌ తమ్మినేని చేసిన వ్యాఖ్యలపై దాఖలైన రిట్‌ పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. బాధ్యతాయుత రాజ్యాగ పదవిలో ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదని పేర్కొంది. స్పీకర్‌ వ్యాఖ్యలు శాసనసభలో చేశారా..? బయట చేశారా.. చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. అయితే, తిరుపతి కొండపై స్పీకర్‌ వ్యాఖ్యలు చేశారని స్టాండింగ్‌ కౌన్సిల్‌ న్యాయవాది గుర్తు చేశారు. ఇదంతా చూస్తుంటే న్యాయ వ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లు భావించాల్సి ఉంటుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు తీర్పులపై అసహనం ఉంటే సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకోవాలని, అలా చేయకుండా బహిరంగంగా కోర్టు తీర్పులపై వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటూ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. ఏపీలో నెలకొన్న పరిస్థితులు దేశంలో మరెక్కడా చూడలేదంటూ వ్యాఖ్యానించింది ధర్మాసనం.

స్పీకర్‌తోపాటు డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎంపీలు నందిగం సురేష్‌, విజయసాయిరెడ్డి, ఆమంచి కృష్ణమోహన్‌ సహా వైసీపీ నేతలు సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలపైనా హైకోర్టులో విచారణ జరిగింది.. హైకోర్టు తరపున న్యాయవాది అశ్విన్‌ కుమార్‌ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.. విచారణ సందర్భంగా నేతల వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా ఉన్నాయన్న హైకోర్టు.. వీరిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నించింది. ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని, న్యాయమూర్తులు, న్యాయస్థానాలపై చేసిన వ్యాఖ్యలపై రిజిస్ట్రార్‌ కేసులు దాఖలు చేసినా పదవిలో ఉన్న వాళ్లపై ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. నేతలను రక్షించేందుకు మీరు కేసు నమోదు చేయలేదని భావించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. సీఐడీ విఫలమైతే సీబీఐకి విచారణ బదిలీ చేయాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అటు సీబీఐ విచారణపై ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ తెలిపారు. ఈకేసును సీబీఐకి అప్పగించాలన్న అభిప్రాయానికి ఏజీ, ఈఐడీ న్యాయవాది సైతం అంగీకరించారు. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది.

Tags

Read MoreRead Less
Next Story