Vizag Kidnap: వెలుగులోకి వస్తున్న కిడ్నాపర్ల దురాగతాలు

Vizag Kidnap: వెలుగులోకి వస్తున్న కిడ్నాపర్ల దురాగతాలు
మూడేళ్ల క్రితం ఓ డీల్‌ సందర్భంగా ఎంపీకి పరిచయమైన ప్రధాన నిందితుడు హేమంత్‌.. కిడ్నాప్‌కు పక్కా ప్రణాళిక వేసుకొని అమలు చేసినట్లు తెలుస్తోంది

విశాఖ ఎంపీ ఎంవీవీ కుటుంబసభ్యులతోపాటు ఆడిటర్‌ జీవీ కిడ్నాప్‌ కేసులో కిడ్నాపర్ల దురాగతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్ల క్రితం ఓ డీల్‌ సందర్భంగా ఎంపీకి పరిచయమైన ప్రధాన నిందితుడు హేమంత్‌.. కిడ్నాప్‌కు పక్కా ప్రణాళిక వేసుకొని అమలు చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ కుటుంబీకులను తమ నిర్బంధంలో ఉంచుకున్న రెండు రోజుల పాటు వారిని కొట్టడంతో పాటు తీవ్రంగా భయపెట్టించినట్లు తెలుస్తోంది.

ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపిన ముగ్గురు బాధితులు నాలుగు రోజులైనా ఇంకా తేరుకోలేదు. గంజాయి మత్తులో రౌడీషీటర్‌ హేమంత్‌, పాత నేరస్థుడు వలవల రాజేశ్‌, మరో మైనర్‌ కలిసి చిత్రహింసలు పెట్టిన తీరుతో ఉలిక్కి పడుతున్నారు. కిడ్నాప్‌ చేస్తే మీలాంటి పెద్దవాళ్లు ఎవరూ బయటకు చెప్పుకోరు. నాపై ఇప్పటికే మూడు కేసులున్నాయి. అయితే ఇంకోటి నమోదవుతుంది అని హేమంత్‌ రెచ్చిపోయినట్లు సమాచారం.

ఎంపీ కుమారుడు శరత్‌పై మొదటి రోజు దాడిచేసి నిర్బంధించిన తర్వాత ఇంట్లో ఉన్న 15 లక్షలు తీసుకున్నారు. ఖరీదైన గడియారాలు, బంగారు గొలుసులు లాక్కున్నారు. ఆ తర్వాత ఎంపీ భార్య జ్యోతిని పిలిపించి ప్రత్యేకంగా ఓ గదిలో ఉంచి, ఆమె పైనా చేయి చేసుకున్నారు. వైసీపీ నేత, ఆడిటర్‌ జీవీ రాగానే కిడ్నాపర్లు మరింత క్రూరంగా వ్యవహరించారు. 50 కోట్లు ఇవ్వాలంటూ హేమంత్‌ డిమాండ్‌ చేసినట్లు బాధితులు తెలిపారు. డబ్బుల్లేకపోతే కిడ్నాప్‌ చేసిన ఇంటినే రాసివ్వాలంటూ బెదిరించాడు. అవసరమైతే రిజిస్ట్రార్‌ను ఇంటికి పిలిపించి మీరనుకుంటే చేయలేరా అంటూ బెదిరించారని సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story