జగన్ క్విడ్ ప్రోకో-2 గుట్టు రట్టు : మాజీ మంత్రి యనమల

జగన్ క్విడ్ ప్రోకో-2 గుట్టు రట్టు : మాజీ మంత్రి యనమల
విశాఖపట్నం బేపార్క్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీల ఖాతాల్లో జమ అయిందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ బినామీ కొనుగోళ్లలో..

విశాఖపట్నం బేపార్క్ కూడా జగన్మోహన్ రెడ్డి బినామీల ఖాతాల్లో జమ అయిందన్నారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. జగన్ బినామీ కొనుగోళ్లలో మరో లావాదేవీ విశాఖ బేపార్క్ అన్నారు. కాకినాడ సెజ్‌ను అరబిందో పేరుతో ఇప్పటికే జగన్ హస్తగతం చేసుకున్నారని... ఇప్పుడు విశాఖ బేపార్క్ కూడా హెటిరో పేరుతో కైవసానికి సిద్ధం చేశారన్నారు. టీడీపీ హయాంలో విశాఖ రుషికొండ వద్ద అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజం ప్రాజెక్టు అభివృద్దికి శ్రీకారం చుట్టామన్నారు. కొండ మీద, కొండ కింద 36ఎకరాల్లో అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టు అభివృద్దికి నాంది పలికామన్నారు. 120 కోట్లు ఖర్చుచేసి కొండపై మెడికల్ టూరిజం తరహాలో బే పార్క్ అభివృద్ది చేశామన్నారు యనమల.

బినామీల ముసుగులో 300 కోట్ల విలువైన భూమిని, ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవడం ప్రజాద్రోహమని యనమల ఫైర్ అయ్యారు. 120 కోట్లతో అభివృద్ది చేసిన బేపార్క్ చేతులు మారడం వెనుక హస్తం ఎవరిదని ప్రశ్నించారు. బేపార్క్ లో మేజర్ వాటాలు ఎవరి ఒత్తిళ్ల మేరకు హెటిరో పరం అయ్యాయన్నారు. కొండ మీద వాటాల కొనుగోళ్లకు ప్రతిఫలంగా కొండ కింద 225 కోట్ల విలువైన 9ఎకరాల భూమి హెటిరో పరం చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి ఇది కూడా బినామీ లావాదేవీనే అన్నారు. వీటన్నింటిపై కేంద్రం తక్షణమే స్పందించి అత్యున్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని యనమల డిమాండ్ చేశారు.

టిడిపి ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులు అభివృద్ది చేస్తే.. జగన్ రెడ్డి బినామీ ఆస్తుల అభివృద్దిలో ఉన్నారని తెలిపారు. జగన్‌పై సిబిఐ 12 చార్జిషీట్లలో తొలి ఛార్జిషీట్‌లో హెటిరో కూడా సహనిందితుల జాబితాలో ఉందన్నారు యనమల. A1 జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి అయితే, A3 గా అరబిందో, A4 గా హెటిరో ఉన్నాయన్నారు. జడ్చర్ల సెజ్‌లో 75 ఎకరాల భూములు హెటిరోకు కేటాయించినందుకు ప్రతిఫలంగా జగన్ కంపెనీలో 19 కోట్ల 50 లక్షలు పెట్టుబడి పెట్టారని సిబిఐ తొలి ఛార్జ్ షీట్‌లో పేర్కొందన్నారు. హెటిరో డ్రగ్స్ లిమిటెడ్, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, హెటిరో హెల్త్ కేర్ లిమిటెడ్‌పై, హెటిరో డైరెక్టర్ ఎం శ్రీనివాస రెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ కేసులు పెట్టిన విషయాన్ని యనమల గుర్తు చేశారు.

అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో ఏ కంపెనీలకు మేలు చేసి ప్రతిఫలంగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పొందారో, ఇప్పుడు అవే కంపెనీలకు మేలు చేయడం గమనార్హమన్నారు యనమల. 2004-09 మధ్య క్విడ్ ప్రొ కో -1 జరిగితే.. ఇప్పుడు క్విడ్ ప్రొ కో- 2 జరుగుతోందన్నారు. అప్పటి కేసుల్లో తన సహనిందితులకే ఇప్పటి జగన్‌పాలనలో మేలు చేస్తున్నారని యనమల ఆరోపించారు. అప్పటి సహనిందితులకే రాజకీయ పదవులు, ఇప్పుడు బినామీ లావాదేవీలు జరుగుతున్నాయన్నారు. తొలి ఛార్జిషీట్ లో A3గా ఉన్న అరబిందో కంపెనీకే కాకినాడ సెజ్ దఖలు చేశారని యనమల తెలిపారు. A 4 గా ఉన్న హెటిరోకు విశాఖ బేపార్క్ కట్టబెట్టడం... క్విడ్ ప్రొ కో-2 లో భాగమే అన్నారు యనమల రామకృష్ణుడు.

అప్పుడు తండ్రి అధికారం అండతో, ఇప్పుడు తన అధికారంలో... వేలకోట్ల ప్రజాధనం బినామీల పరం చేయడం జగన్ అవినీతి పోకడలకు పరాకాష్ట అని.. యనమల ఫైర్‌ అయ్యారు. కేంద్రం తక్షణమే స్పందించి జగన్మోహన్ రెడ్డి బినామీ లావాదేవీలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు జరపాలని యనమల డిమాండ్ చేశారు. కాకినాడ సెజ్, విశాఖ బేపార్క్ భూముల కొనుగోళ్ల లావాదేవీలపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రో కో-2 గుట్టు రట్టు చేస్తామన్నారు యనమల.

Tags

Read MoreRead Less
Next Story