ఏపీ వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ విస్తృతంగా తనిఖీలు

ఏపీ వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ విస్తృతంగా తనిఖీలు
ఏపీ వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్‌..

ఏపీ వ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏకకాలంలో అన్ని తహసీల్దార్‌, మున్సిపాలిటీ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండల రెవెన్యూ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మొత్తం రెవెన్యూ అధికారులను, సిబ్బందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. తహసీల్దార్ చంద్రశేఖర్ నాయుడు కారులో రెండు లక్షరూపాయలు డిప్యూటీ తహసీల్దార్ కారులో లక్ష రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జగ్గయ్యపేట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు నిర్వహించారు, ఐదుగురు అనాధికార సిబ్బంది వద్ద రూ.43 వేలు స్వాధీనం చేసుకున్నారు. సబ్ రిజిస్టర్ కృష్ణారావు లీవ్‌లో ఉండడంతో ఇన్‌చార్జి సబ్ రిజిస్టర్ బాబురావు..ఇద్దరు అనాధికార సిబ్బందిని నియమించారు. ముగ్గురు డాక్యుమెంటర్ రైటర్ల సిబ్బంది నుంచి రూ.33,300తో పాటు సబ్ రిజిస్టర్ పెట్టుకున్న అనాధికార సిబ్బంది నుంచి రూ.11,180ను ఏసీబీ అధికారులు సీజ్ చేశారు.

గుంటూరు జిల్లా రాజుపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. పాస్‌ పుస్తకాల మంజూరులో అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందడంతో సోదాలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా గూడురు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. కార్యాలయంలోని పలు రికార్డులను అధికారులు పరిశీలించారు. అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. భారీగా లంచాలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీ డీఎ‍స్పీ శివ నారాయణ తన సిబ్బందితో కలసి పట్టణంలోని పాత, కొత్త తహసీల్దార్ కార్యాలయాలపై దాడి చేశారు. పాత కార్యాలయం అడ్డాగా కొందరు వీఆర్‌వోలు అక్రమాలు చేస్తున్నారన్న ఫిర్యాదులు అందడంతో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రామయ్యను కార్యాలయానికి పిలిపించి విచారించారు .

శ్రీకాకుళం జిల్లాలో పలు తహశీలార్ల కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. సంతకవిటి కార్యాలయంలో తనిఖీలు చేస్తుండగా వీఆర్‌వోలు, సిబ్బంది పరారయ్యారు. అటు అనంతపురం జిల్లా కూడేరు తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. భూ రికార్డులకు సంబంధించి కంప్యూటర్‌ ఆపరేటర్‌ను అధికారులు ప్రశ్నించారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. విజయనగరం జిల్లా బలిజపేట తహశీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించారు. విశాఖ జిల్లా కశింకోట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులను అధికారులు పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story