తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మేఘం గర్జించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో.. మరో 2రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి మేఘం గర్జించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో.. మరో 2రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వాయుగుండం 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే సూచనలు ఉన్నాయి. విశాఖకు ఆగ్నేయంగా 330 కిలోమీటర్లు., కాకినాడకు తూర్పు ఆగ్నేయంగా 370కిలోమీటర్లు.., నర్సాపూర్ కు 400 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్యం దిశగా పయనించి సోమవారం రాత్రి నర్సాపురం-విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉంది.

వాయుగుండం ప్రభావంతో.. కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ఏపీలో మిగిలిన చోట్ల మోస్తరు నుంచి తేలిక వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో.. మత్స్యకారులు వేటకు వెళ్ల వద్దని అయా జిల్లాల అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు వాయుగుండం స్థితిని పర్యవేక్షిస్తూ తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయనున్నారు.

రెండు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలకు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండెంతో సోమ, మంగళ వారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా భారీ, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమీషనర్లతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం కోరారు. అధికారులంతా ఎక్కడివారు అక్కడే ఉండి... పరిస్థితిని గమనిస్తూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని సూచించారు. భారీ వర్షాలతో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story