Andhra Pradesh: ఇసుక లూటీ డబ్బు ఎన్నికల్లో ఖర్చు
ఎన్నికల ప్రచారానికి అధికార వైకాపా పచ్చనోట్లు అనధికారికంగానే కాదు అధికారికంగానూ కుమ్మరిస్తోంది. జగన్ మేమంతా సిద్ధం సభలకు వేలసంఖ్యలో ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకుంటున్న వైకాపా వాటికి కోట్ల రూపాయల డబ్బును నగదు రూపంలో చెల్లించింది. అంత సొమ్ము వైకాపాకు ఎక్కడిది? అదే జగన్ రాసుకున్న ఇసుక దోపిడీ స్క్రిప్ట్.! ఇసుకను అడ్డుపెట్టుకుని వేలకోట్లు ఊడ్చేసి ఎన్నికల వేళ వాటిని ఎలా బయటకు తీయాలో పక్కా స్కెచ్ వేసుకున్నారు. ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం ఇసుక రూపంలో ప్రజలపై అధికారికంగా వేసిన భారమే 4 వేల 200 కోట్ల రూపాయలు. ఏపీఎండీసీ.. ద్వారా ఇసుక అమ్మిన మొదటి 20 నెలల్లోప్రజల నుంచి 1680 కోట్లు రాబట్టారు. ప్రైవేటు గుత్తేదారులు వచ్చాక 2 వేల 520 కోట్లు పిండుకున్నారు. ఇక ప్రభుత్వానికి లెక్కచూపకుండా 3 వేల కోట్లపైనే దోచుకున్నారు.
తెలుగుదేశం హయాంలో ఉచిత ఇసుక విధానం అమల్లో ఉండేది. ఇసుక కావాలంటే లోడింగ్, రవాణా ఖర్చు భరిస్తే సరిపోయేది. జగన్ సీఎంకాగానేఉచిత ఇసుక విధానాన్నిరద్దు చేశారు. ఇసుకను ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. 2019, సెప్టెంబరు 5 నుంచి కొత్త విధానం అమల్లోకి తెచ్చారు. టన్ను ఇసుక ధర 375 రూపాయలుగా నిర్ణయించారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలను ప్రభుత్వరంగ సంస్థైనఏపీ ఖనిజాభివృద్ధి సంస్థకు మొదట్లో అప్పగించారు ఆన్లైన్ బుకింగ్ సదుపాయం కల్పించినా, ఎక్కువ మందికి ఇసుక లభించలేదు. అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా ఒక్కసారిగా కొరత ఏర్పడింది.దాదాపు 50 లక్షల మంది కార్మికులు ఐదారు నెలలపాటు.. పనుల్లేక అల్లాడారు. అప్పుడు మేల్కొన్న సీఎం ఇసుక వ్యాపారాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నిర్ణయించారు. ఆ అక్కడి నుంచే దోపిడీ స్క్రిప్ట్ అమలుచేశారు.
2021 జనవరిలో వైకాపా ప్రభుత్వం ఇసుక టెండర్లు పిలిచింది. రాష్ట్రంలోని 3ప్యాకేజీలను ఉత్తరాదికి చెందిన జయ్ప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ దక్కించుకునేలా వ్యూహం రచించారు. టన్ను ఇసుక ధరను 475 రూపాయలకు పెంచేశారు. ఐతే... ఈ టెండర్లకు సరిగ్గా రెండు వారాల ముందు.. చెన్నై కేంద్రంగా టర్న్కీ ఎంటర్ప్రైజెస్ అనే సంస్థ పుట్టుకొచ్చింది. వైకాపా పెద్దలకు అత్యంత సన్నిహితుడైన చెన్నై మైనింగ్ వ్యాపారే టర్న్కీ సూత్రధారి. అలా ఇసుకలో ఉపగుత్తేదారుగా రంగప్రవేశం చేసింది టర్న్కీ. APMDCద్వారా ఇసుక లావాదేవీలు ఆన్లైన్ చెల్లింపులతో జరిగేవి. టర్న్కీ వచ్చాక.. మొత్తం నగదు రూపంలోనే వసూలు చేశారు. ప్రతి రీచ్లో వసూలైన నగదును.. హైదరాబాద్లో ప్రభుత్వ పెద్దలు చెప్పినచోట అందజేస్తూ వచ్చారు. ముద్రిత బిల్లులు జారీచేస్తూ గనులశాఖకు తప్పుడు లెక్కలు చూపారు. రీచ్ల్లోఅక్రమాలు బయటకు రాకుండా అక్కడుండే సీసీ కెమెరాలను పనిచేయకుండా చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వొద్దని హైకోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశించాయి. 110 రీచ్ల్లో తవ్వకాలు ఆపేయాలని గనులశాఖను, గుత్తేదారు జేపీ సంస్థను గతేడాది ఏప్రిల్లో..పర్యావరణ మదింపు సంస్థ- సియా ఆదేశించింది. కానీ తవ్వకాలు ఆపలేదు సరికదా, మళ్లీ అధికారం దక్కుతుందో లేదో అనే బెంగతో భారీ యంత్రాల్ని పెట్టి నదులను ఊడ్చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com