జనసేనానికి ముద్రగడ స్ట్రాంగ్ కౌంటర్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఘాటు లేఖ రాశారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమాలు చేసి రాజకీయంగా ఎదిగారంటూ వారాహి యాత్రలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ముద్రగడ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కాపు ఉద్యమాన్ని తన ఎదుగుదలకు వాడుకోలేదని.. చిత్తశుద్ధితో ఉద్యమించానని..... నేతలను విమర్శించడం మానేసి.. పవన్ అసలు విషయాలపై దృష్టిసారించాలని సుదీర్ఘ లేఖలో పవన్కు ముద్రగడ చురకలంటించారు. తన కంటే చాలా బలవంతుడైన పవన్.. తాను వదిలేసిన ఉద్యమాన్ని చేపట్టి యువతకు రిజర్వేషన్ ఎందుకు తీసుకురాలేదో చెప్పాలని ప్రశ్నించారు. జగ్గంపేట సభలో రిజర్వేషన్ అంశం కేంద్ర పరిధిలోనిదని వై.ఎస్. జగన్ అన్నప్పుడు... తాను ఇచ్చిన సమాధానాన్ని పవన్ తెలుసుకోవాలని ముద్రగడ సూచించారు. తన సమాధానం తర్వాత కాపు సామాజిక వర్గానికి 20 కోట్లు ఇస్తానన్న వద్దన్న విషయాన్ని గుర్తు చేశారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి దొంగే అయితే రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎందుకు గెలుపొందారో ఆలోచించాలని జనసేనానికి సూచించారు. కాపు ఉద్యమాలకు సహాయం చేసిన వారిని విమర్శించడం తగదని హితవు పలికారు. పవన్ తన ప్రసంగాల్లో తరచూ తొక్క తీస్తా, నార తీస్తా, క్రింద కూర్చోబెడతా, చెప్పుతో కొడతా, గుండు గీయిస్తా అంటుంటారని... ఆయన ఎంతమందికి తీయించి, కింద కూర్చోబెట్టారో, గుండ్లు ఎంతమందికి చేయించారో, ఎంతమందిని చెప్పుతో కొట్టారో సెలవివ్వాలని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. 175 స్థానాలకు పోటీ చేసినప్పుడే ముఖ్యమంత్రిని చేయాలి అనే పదం వాడాలని.... పొత్తుతో పోటీ చేస్తానని చెప్తున్న మీరు సీఎం ఎలా అవుతారని ముద్రగడ... పవన్ను ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను తిట్టడానికి విలువైన సమయం వృధా చేసుకోవద్దని పవన్కు హితవు పలికిన ముద్రగడ.. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ, ప్రత్యేక రైల్వేజోన్, కడప స్టీల్ప్లాంట్ సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. పవన్ను నిజంగా రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే తన సలహాల ఆధారంగా యుద్ధం చేయాలన్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com