వైసీపీ పాలనలో సంక్షేమం మూరెడు.. విద్యుత్ బిల్లులు బారెడు : లోకేష్
ఏపీలో జగన్ సర్కారు పాలనపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. జగన్ రెడ్డి బాదుడు, దోపిడికి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనలో సంక్షేమం మూరెడు.. విద్యుత్ బిల్లులు బారెడుగా మారిందన్నారు. విద్యుత్ బిల్లులు పట్టుకోకుండానే షాక్ కొట్టి దిమ్మతిరిగిపోతుందని, సర్దుబాటు ఛార్జీల పేరుతో రూ. 4 వేల కోట్లు సర్దేస్తున్నారని ఆరోపించారు లోకేష్. ప్రతిపక్షంలో ఉండి చెప్పిన పత్తిత్తు కబుర్లు, విద్యుత్ ఛార్జీలు పెంచనంటూ ఇచ్చిన హామీలు గుర్తులేవా? అంటూ సీఎం జగన్ను ప్రశ్నించారు. రెండున్నరేళ్ల పాలనలో ఐదు సార్లు విద్యుత్ ఛార్జీలు వడ్డించి రూ. 9069 కోట్లు దోచేశారని, అమ్మా కరెంట్ బిల్లెంత? అక్కా బిల్లెంత? అని అడిగే దమ్ము ఇప్పుడుందా అంటూ ప్రశ్నించారు నారా లోకేష్. రకరకాల పేర్లతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com