వివేకా హత్య కేసులో.. లాయర్ గా మారిన సునీత

వివేకా హత్య కేసులో.. లాయర్ గా మారిన సునీత
వివేకా హత్య కేసులో హంతకులకు శిక్ష పడేందుకు ఆయన కుమార్తె సునీత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి తాను లాయర్ కావాల్సి వచ్చింది.

వివేకా హత్య కేసులో హంతకులకు శిక్ష పడేందుకు ఆయన కుమార్తె సునీత తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి తాను లాయర్ కావాల్సి వచ్చింది.అదీ కూడా సుప్రీంకోర్టులో A8 అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్ పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వేసవి సెలవుల్లో ధర్మాసనంలో జూనియర్‌ న్యాయవాదులను ప్రోత్సహించేందుకు సీనియర్లకు అవకాశం ఇవ్వట్లేదని న్యాయమూర్తులు చెప్పడంతో తానే వాదనలు వినిపిస్తానంటూ సునీతారెడ్డి ముందుకు వచ్చారు.దీనిపై స్పందించిన జస్టిస్ విక్రమ్ నాథ్ ఎవరైనా సీనియర్‌ లాయర్ ను సాయం కోసం పెట్టుకోవాలని సూచించింది. సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రాను సునీతకు సాయం చేయాలని కోరింది. సునీత స్వయంగా తన వాదనలు వినిపించారు. ఇతర లాయర్లు చేసినట్లుగానే తన వాదనలు వినిపించారు.

ఈ కేసులో విస్తృత కుట్రలో భాగస్వామి అయిన A8 అవినాష్‌రెడ్డి దర్యాప్తునకు సహకరించకపోయినా, అతనికి ముందస్తు బెయిలు ఇచ్చారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అతన్ని సీబీఐ కస్టడీలో విచారించేందుకు ఇవ్వాలని కోరినా కోర్టు ముందస్తు బెయిలు ఇవ్వడం వల్ల ఆ పనిచేయలేకపోయిందని పేర్కొన్నారు. అతనికి ఎందుకు ముందస్తు బెయిలు ఇవ్వకూడదన్న విషయాన్ని తాను ధర్మాసనం దృష్టికి తేవాలనుకుంటున్నట్లు చెప్పారు. అప్పుడు జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా జోక్యం చేసుకుంటూ అందులో మీరెందుకు జోక్యం చేసుకోవాలని నిందితుడిని కస్టడీలో విచారించాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సింది సీబీఐ అని వ్యాఖ్యలు చేసింది ధర్మాసనం.

ఇక అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చే విషయంలో హైకోర్టు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని సీబీఐ సేకరించిన సాక్ష్యాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని సునీత ధర్మాసనానికి తెలిపారు. ఇదే కేసులో సుప్రీం ఆదేశాలను హైకోర్టు పట్టించుకోలేదన్నారు.సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తున్నారని,ఇతర నిందితులతో కలిసి ఎంపీ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని తెలిపారు. ఎంపీ అవినాష్‍కు ఏపీ ప్రభుత్వం కూడా సహకరిస్తోందని అధికార పార్టీలోని కీలక వ్యక్తుల మద్దతు ఉందన్నారు. సీబీఐ అధికారులపై అవినాష్ తప్పుడు ఫిర్యాదులు చేశారని ప్రైవేటు కేసులు నమోదు చేయించారనికోర్టు దృష్టికి తీసుకెళ్లారు. త‌దుప‌రి విచార‌ణ 19కి వాయిదా పడింది.

మరోవైపు తన వాదనల్లో సునీత జగన్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చారు. అవినాష్‍కు అసెంబ్లీ సాక్షిగా జగన్ క్లీన్‍చిట్ ఇచ్చారని పిటిషన్‍లో పేర్కొన్న సునీత వివేకా హత్య గురుంచి జగన్‍కు ముందే తెలిసిందని వాదించారు. జగన్‍కు ముందే తెలిసిన విషయాన్ని సీబీఐ బయటపెట్టిందన్నారు. దాదాపుగా అన్ని అంశాలపై సునీత తన వాదనలు వినిపించారు. అయితే దర్యాప్తు ఎలా జరుగుతోందన్నది సీబీఐ పరిధిలోని అంశమని తాము నోటీసులు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అద‌న‌పు డాక్యుమెంట్లు దాఖ‌లు చేయ‌డానికి సునీతారెడ్డికి సుప్రీంకోర్టు అవ‌కాశం ఇచ్చింది.

Tags

Read MoreRead Less
Next Story