SUPREME COURT: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

SUPREME COURT: ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
చంద్రబాబు కేసులో హైకోర్టులో సమర్పించిన దస్త్రాలు ఇవ్వాలని ఆదేశం

స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది. అప్పటిలోపు చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌కు సంబంధించి ఏపీ హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమ ముందు పెట్టాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్కిల్‌ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు 2018లోనే ప్రారంభమైనట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు హైకోర్టు తీర్పులో లేవన్న సుప్రీంకోర్టు, అందుకు సంబంధించిన స్పష్టత కావాలని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం 17A వచ్చిన తర్వాతే ఈ కేసులో FIR నమోదైందని సర్వోన్నత ధర్మాసనం అభిప్రాయపడింది.

సుప్రీంకోర్టులో మొదట చంద్రబాబు తరఫున హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఈ కేసులో 2021 డిసెంబర్ 9న FIR నమోదైందని, అంతకుముందే విచారణ ప్రారంభమైందని హైకోర్టు న్యాయమూర్తి తీర్పులో పేర్కొనడం తప్పని వాదించారు. 2021 సెప్టెంబర్ 7న అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు అందిన లేఖ ఆధారంగా FIR నమోదు చేసినట్లు వాదించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి మోసపూరితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారని వివరంచారు.

అధికారంలో ఉన్నవారి కక్ష సాధింపు నుంచి పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికే పార్లమెంటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని చేర్చిందని వివరించారు. సవరించిన చట్టం ప్రకారం అధికార విధుల నిర్వహణలో భాగంగా పబ్లిక్ సర్వెంట్లు చేసిన సిఫారసులు, నిర్ణయాలపై అధీకృత వ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారీ విచారణ కానీ, దర్యాప్తు కానీ ప్రారంభించడానికి వీల్లేదని వివరించారు. కానీ ఈ సెక్షన్ పాత నేరాలకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని మొత్తం తప్పంతా అందులోనే ఉందన్నారు. రిమాండ్ రిపోర్టులో పిటిషనర్‌కు వ్యతిరేకంగా పేజీల కొద్దీ ఆరోపణలు చేశారన్న సాల్వే అందులో చెప్పినవన్నీ సీఎం హోదాలో తీసుకున్న నిర్ణయాలే అన్నారు. విచారణ ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే 17A వర్తిస్తుందా? అని జస్టిస్‌ అనిరుద్ద బోస్‌ ప్రశ్నించగా అవునని సాల్వే సమాధానం ఇచ్చారు.

చంద్రబాబు తరపున వాదనలు వినిపించిన మరో న్యాయవాది అభిషేక్ సింఘ్వీ సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో ఇచ్చిన యశ్వంత్ సిన్హా తీర్పులోని పేరా 118లో ఈ విషయం ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. 2018లో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి 17A ని చేర్చారని అందువల్ల అంతకుముందు తీసుకున్న నిర్ణయాలపైనా..అధీకృత వ్యవస్థ అనుమతి లేకుండా విచారణ చేయడం కానీ, దర్యాప్తు చేపట్టడంకానీ కుదరదని..సుప్రీంకోర్టు యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పిందన్నారు. కాబట్టి చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తిగా తప్పని వాదించారు. ఇక్కడ FIR ఎప్పుడు నమోదైందని జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించగా 2021 డిసెంబర్ 9న అని చెప్పారు. ఇది మొత్తం చట్ట విరుద్ధం అని స్పష్టమవుతోందని సాల్వే వివరించారు.

ఇప్పటి వరకు తాము పరిశీలించిన వివరాలు పరిశీలిస్తే... 17ఎ సెక్షన్‌ అమలులోకి వచ్చిన తర్వాతే ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని అంగీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఐతే అందులో ఐపిసి నేరాలకు మినహాయింపులు ఇవ్వలేదు కదా అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్‌ లిస్ట్ వారు దాఖలు చేసిన కౌంటర్లో ఉందని చెప్పిన సిద్దార్ధలూథ్రా కోర్టుకు సమర్పించారు. అయితే ధర్మాసనం అందుకు సోమవారం వరకు సమయం ఇవ్వగా ఆలోపు దాఖలు చేస్తామని ముకుల్ రోహత్గీ తెలిపారు. దానిపై అవసరమైతే తాము కౌంటర్ దాఖలు చేస్తామని లూథ్రా తెలిపారు.అనంతరం ధర్మాసనం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story