Telangana Results 2023: కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఘన విజయం

Telangana Results 2023: కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి ఘన విజయం
మొదలైన గెలుపు సంబరాలు..

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ ఇప్పటి వరకు 14 స్థానాల్లో జయకేతనం ఎగురవేసి.. 51 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కొడంగల్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, భారాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు. రేవంత్‌కు 30వేల పైచిలుకు మెజారిటీ వచ్చింది. మరోవైపు కామారెడ్డిలో హోరాహోరీ పోరు నడుస్తోంది. భారాస అధినేత, సీఎం కేసీఆర్‌.. రేవంత్‌రెడ్డి మధ్య ఆసక్తికర పోటీ జరుగుతోంది. అక్కడ రేవంత్‌ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో 11 రౌండ్లు ముగిసేసరికి 3,335 ఓట్ల ఆధిక్యంలో ఆయన కొనసాగుతున్నారు.

మరోవైపు హుజూర్‌నగర్‌, అందోల్‌, జుక్కల్‌, నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గెలుపొందగా.. అందోల్‌లో దామోదర రాజనర్సింహ, జుక్కల్‌లో లక్ష్మీకాంతరావు, నల్గొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయం సాధించారు.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్.. 60. ఈ మార్క్‌ను అలవోకగా అందుకుంది కాంగ్రెస్. తొలి రౌండ్ నుంచే ఆధిక్యతను ప్రదర్శిస్తూ వచ్చింది. ఎక్కడే గానీ వెనుకంజ వేసినట్లు కనిపించలేదు. పోస్టల్ బ్యాలెట్లలో సాధించిన పైచేయిని ఈవీఎం లెక్కింపుల్లోనూ కంటిన్యూ చేసింది. సంపూర్ణ మెజారిటీ సాధించే దిశగా కాంగ్రెస్ అడుగులు పడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీ నేతల్లో జోష్ పెరిగింది. పెద్ద ఎత్తున ఉత్సవాలు మొదలు పెట్టేశారు. బాణాసంచా కాల్చుతూ సంబరాల్లో మునిగిపోయారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్ సహా జిల్లా కార్యాలయాల్లో సందడి నెలకొంది. హైదరాబాద్‌లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి ఇంటికి భారీ సంఖ్యలో చేరుకున్నారు కాంగ్రెస్ నేతలు. పార్టీ జెండాలను ప్రదర్శిస్తూ జైకొట్టారు. పార్టీ మాజీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఫ్లెక్సీలు, బ్యానర్లను వెంట తీసుకొచ్చారు.. వారికి జిందాబాద్‌ పలికారు.

Tags

Read MoreRead Less
Next Story