త్వరలో TTD వెబ్సైట్లో రీఫండ్ ట్రాకర్- ఈవో
తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసి గదులు పొందిన భక్తులకు ప్రస్తుతం రీఫండ్కు సంబంధించిన సమాచారాన్ని SMS ద్వారా పంపుతున్నామని TTD ఈవో ధర్మారెడ్డి తెలిపారు. అయితే.. త్వరలో రీఫండ్ను ట్రాక్ చేసేందుకు TTD వెబ్సెట్లో ట్రాకర్ను పొందుపరుస్తామని వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆయన డయల్ యువర్ ఈవో కార్యక్రమం నిర్వహించారు. స్పీడ్ పోస్టు చేసినపుడు ఏ విధంగా కవర్ను ట్రాక్ చేయవచ్చో.. అదే తరహాలో అద్దెగది రీఫండ్ సొమ్ము సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.
తిరుమలలో యూపీఐ విధానంలో చెల్లింపులు చేసి గదులు పొందిన భక్తులకు.. వారు గదులు ఖాళీ చేసిన వెంటనే డిపాజిట్ మొత్తం రీఫండ్ చేయడం జరుగుతుందని చెప్పారు. అనారోగ్య సమస్యలు, నడవలేని భక్తులు సర్వదర్శన టోకెన్లు, లేదా 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఉంటే.. వారి సర్టిఫికెట్ చూపించి బయో మెట్రిక్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించవచ్చన్నారు. అటు.. శ్రీవాణి ట్రస్ట్ నిధులు వెయ్యి కోట్లకు చేరువలో ఉన్నాయని ఈవో తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com