Ys Sunitha Reddy : వైఎస్ సునీత రాజకీయ అరంగేట్రం

Ys Sunitha Reddy : వైఎస్ సునీత రాజకీయ అరంగేట్రం
వివేకా 5వ వర్ధంతి రోజునే నిర్ణయం?

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత త్వరలోనే రాజకీయ ప్రకటన చేయబోతున్నట్లు పులివెందులలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తన తండ్రి అయిదో వర్ధంతి రోజైన ఈ నెల 15న ఓ నిర్ణయం తీసుకోవాలని ఆమె భావిస్తున్నారని సమాచారం.

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి.. ఈనెల 15వ తేదీన కడపలో ఆత్మీయ సమావేశం పేరిట అభిమానులతో భేటీ కానున్నారు. రాజకీయంగా వేసే అడుగులపై కీలక ప్రకటన చేయాలని భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితులు, అందుకు గల కారణాలను వైయస్‌ఆర్‌ జిల్లా వాసులకు.. ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. తండ్రి వివేకా హత్య.. సీబీఐ దర్యాప్తులో వెలుగు చూసిన కుట్ర కోణాలు, అనంతర పరిణామాలు, బాధితులైన తమపైనే పోలీసులు ఎదురు కేసులు పెట్టడాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే న్యాయ పోరాటం కొనసాగిస్తున్న సునీత.. సరైన రాజకీయ వేదిక ద్వారా రానున్న ఎన్నికల్లో పులివెందుల వైకాపా నేతలను ఎదుర్కోవాలనే దానిపై అభిమానుల అభిప్రాయాలు తెలుసుకోనున్నారు.

రానున్న ఎన్నికల్లో వివేకా భార్య సౌభాగ్యమ్మను కడప ఎంపీ లేదా పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించాలనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ ఆత్మీయ సమావేశంలో ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం పులివెందులలోని విజయ గార్డెన్స్‌ను ఎంపిక చేసి ఈ నెల 15వ తేదీకి అద్దె సైతం చెల్లించారు. ఒప్పందం చేసుకున్నాక... వైకాపా నేతల ఒత్తిళ్లతో దాని నిర్వాహకులు మాటమార్చి ఆ రోజుకు ఫంక్షన్‌ హాలు ఖాళీ లేదని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆత్మీయ సమావేశాన్ని సునీత కడపకు మార్చుకున్నారు. ఇటీవల దిల్లీ వేదికగా సునీత మీడియా సమావేశం నిర్వహించి తన వాదన.. వేదనను వెలిబుచ్చారు. రానున్న ఎన్నికల్లో జగనన్నకు ఓటు వేయవద్దంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. రెండో అడుగుగా ఆత్మీయ సమావేశం పేరిట కార్యక్రమాన్ని తలపెట్టి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించనున్నారని తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story