మిథునం రీమేక్.. బాలు పాత్రలో అమితాబ్
తెలుగు ప్రేక్షకులకు అపురూప ప్రేమ కావ్యాన్ని అందించారు తనికెళ్ల భరణి.. మిథునం చిత్రంలో ఎస్పీ బాలు, లక్ష్మి తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేయడానికి సన్నహాలు చేస్తోంది చిత్ర యూనిట్. ఇందులో బిగ్బి అమితాబ్, అలనాటి అందాల తార రేఖ నటించనున్నట్లు తెలుస్తోంది.
ఎస్పీ బాలసుబ్రమణ్యం భారతీయ సినిమాకు దొరికిన ఆణిముత్యం. ఆయన మిథునంలో ఒదిగిపోయిన తీరు తెలుగు ప్రేక్షకులను అబ్బురపరుస్తుంది. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన పాట ప్రతి రోజూ మనల్ని పలకరిస్తూనే ఉంది. బాలసుబ్రమణ్యం కేవలం గాయకుడు మాత్రమే కాదు. సంగీత దర్శకుడు, నటుడు, కథకుడు, నిర్మాత మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్. సినిమాలో సహాయక పాత్ర పోషించే అవకాశం కూడా ఆయనకు లభించింది. కన్నడ, తెలుగులతో సహా ఇతర భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు బాలు. ఇప్పుడు, ఆయన నటించిన మిథునం చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. బాలసుబ్రమణ్యం పాత్రకు అమితాబ్ బచ్చన్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఒక పెద్ద నిర్మాణ సంస్థ బాలీవుడ్లో ఈ చిత్రాన్ని రూపొందించడానికి రీమేక్ హక్కులను కొనుగోలు చేసింది. బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్కు అనుగుణంగా కొన్ని మార్పులు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ చిత్రం రీమేక్లో అమితాబ్ సరసన రేఖను హీరోయిన్గా తీసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు జయా బచ్చన్ పేరు కూడా వినిపిస్తోంది. మిథునం సినిమా 2012 లో విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. బాల సుబ్రమణ్యం నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే హిందీ రీమేక్కి ఎవరు దర్శకత్వం వహిస్తున్నారో ఇంకా వెల్లడించలేదు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com