వస్తున్నాయ్.. వస్తున్నాయ్ అంబానీ, అదానీ బ్యాంకులు
దేశీయ ఫైనాన్షియల్ రంగంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ముఖ్యంగా బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ విభాగంలో ఉన్న కఠిన ఆంక్షలు ఎత్తివేస్తూ.. మరిన్న కీలక సంస్కరణలు తీసుకొస్తుంది. దీంతో ఇక మీదట కార్పోరేట్ కంపెనీలు కూడా బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టడానికి మార్గం సుగమం కానుంది.
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ప్రమోటర్లు గైడ్ లైన్స్, కార్పొరేట్ సిస్టమ్ రివ్యూ చేయడానికి 2020 జూన్ 12న ఆర్బీఐ అంతర్గతంగా ఓ వర్కింగ్ గ్రూప్ను నియమించింది. ఈ కమిటీ పలు కీలక సూచనలు,సిఫార్సులు చేసింది. ఇందులో ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలనూ బ్యాంకింగ్ రంగంలో అనుమతించాలని RBI ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ సిఫారసు చేసింది. అయితే, బ్యాంకింగ్ నియంత్రణ చట్టంలో అవసరమైన సవరణలు చేయాలని సూచించింది. రెగ్యులేటరీ వ్యవస్థలను పటిష్ఠం చేశాకే ప్రైవేట్ బ్యాంక్ల ప్రమోటర్లుగా వీరిని అనుమతించాలని ప్రతిపాదించింది. దీంతో ఇక మీదట టాటా, బిర్లా, రిలయన్స్, అదానీ, ఎల్ అండ్ టీ వంటి దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు భవిష్యత్లో బ్యాంకింగ్ రంగంలో కీలకంగా మారనున్నారు.
పదిహేనేళ్లలో ప్రైవేట్ బ్యాంక్ల ప్రమోటర్ల వాటా పరిమితిని ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 26 శాతానికి పెంచాలని చెప్పింది. ఆర్థికంగా మెరుగైన పనితీరును కనబరుస్తున్న పెద్దపెద్ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (NBFC)లు ప్రైవేట్ బ్యాంక్లుగా మారేందుకు అవకాశం కల్పించాలి. కనీసం 10 ఏళ్లుగా కార్యకలాపాలు కొనసాగిస్తూ, రూ.50,000 కోట్లు.. అంతకు మించి ఆస్తులున్న NBFCలకు అర్హత ఉండేలా నిబంధనలు అమలు చేయాలి. కొత్తగా ప్రైవేట్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన అర్హతను ప్రస్తుతమున్న రూ.500 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు పెంచాలి. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లైసెన్సుల జారీకి కనీస మూలధన పరిమితిని రూ.200 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పెంచాలి.
ఇక ప్రభుత్వ బ్యాంకు రంగంలోని బ్యాంకుల ప్రైవేటీకరణలో భాగంగా కార్పొరేట్ కంపెనీలకు, విదేశీ బ్యాంకులకు ఇన్వెస్ట్ చేసేందుకు నిబంధనలు సడలించేలా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com