SBI కొత్త ఛైర్మన్ గా దినేష్ ఖరా
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయిన SBIకి కొత్త ఛైర్మన్ వచ్చారు. బ్యాంకులో అత్యంత సీనియర్ ఉద్యోగుల్లో ఒకరు అయిన దినేష్ ఖరాను నియమించింది ప్రభుత్వం. అక్టోబర్ 7 నుంచి వచ్చే మూడేళ్లు ఆయన బ్యాంకు ఛైర్మన్ గా బాధ్యతల్లో ఉంటారు. ఆగస్టు 28న ది బ్యాంక్ బోర్డు బ్యూరో ఆయన్ను రికమండ్ చేసింది. ఇప్పటికే బాధ్యతల్లో ఉన్న రజనీష్ కుమార్ కు కొనసాగింపును నిరాకరించింది. ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న దినేష్ SBI గ్లోబల్ బ్యాంకింగ్ మరియు సబ్సడరీస్ విభాగం బాధ్యతలు చూస్తున్నారు.
1984లో ప్రొబెషనరీ అధికారిగా చేరిన దినేష్ ఖరా బ్యాంకులో వివిధ విభాగాల్లో పనిచేశారు. బ్యాంకులో అన్ని విభాగాల్లో అనుభవం ఉంది. రిటైల్, క్రెడిట్, SME, కార్పొరేట్ క్రెడిట్, డిపాజిట్ మొబిలైజేషన్, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ ఆపరేషన్ సహా అన్ని విభాగాల్లో ఆయన అనుభవం వల్లే ఆయన్ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. SBI ఫండ్స్ మేనేజ్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ MD , CEOగా కూడా పనిచేశారు. కోవిడ్ కారణంగా బ్యాంకింగ్ రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ సమయంలో బాధ్యతలు తీసుకుంటున్న దినేష్ ఖరాకు ఇది అతిపెద్ద సవాలు అంటున్నాయి మార్కెట్ వర్గాలు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com