టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం... 16 మందికి క్లీన్‌చిట్‌

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం... 16 మందికి  క్లీన్‌చిట్‌
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.. డైరెక్టర్‌ పూరి జగన్నాథ్, తరుణ్‌లతో పాటుగా 16 మంది సెలబ్రిటీలకి ఎక్సైజ్‌ క్లీన్ చీట్ ఇచ్చింది.

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. టాలీవుడ్‌ ప్రముఖులందరికీ క్లీన్‌ చిట్‌ ఇస్తూ ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎక్సైజ్‌ శాఖకు నివేదిక ఇచ్చింది. ప్రముఖులు స్వచ్ఛందంగా వారి రక్తం, గోళ్లు, వెంట్రుకలు ఇచ్చారని ఎక్సైజ్‌శాఖ వెల్లడించింది. ఇందులో డ్రగ్స్ తీసుకున్నట్టు ఎలాంటి ఆనవాళ్లు లేవని తెలిపింది. దీంతో పూరీ జగన్నాథ్‌, తరుణ్‌, రవితేజ, తనీష్‌, ముమైత్‌ ఖాన్, శ్యామ్‌ కే నాయుడు, సుబ్బరాజు, నవదీప్‌, చిన్నా, ఛార్మి, నందు, రానా, రకుల్‌ లకు క్లీన్‌ చిట్‌ ఇస్తూ ఎక్స్సైజ్‌ శాఖ తాజాగా వెల్లడించింది.

2017 జులైలో పూరి జగన్నాథ్, తరుణ్‌ల నుంచి ఎక్సైజ్ అధికారులు రక్తం, గోళ్లను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ పరీక్షించింది. దాంట్లో ఎక్కడా కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. గతేడాది డిసెంబర్ 8న దీనికి సంబంధించిన నివేదికను ఎఫ్ఎస్ఎల్.. ఎక్సైజ్ శాఖకు సమర్పించింది. కెల్విన్‌పై ఛార్జ్‌షీటుతో పాటు వివరాలు కోర్టుకు సమర్పించింది ఎక్సైజ్ శాఖ. ప్రధాన నిందితుడు కెల్విన్‌కు రంగారెడ్డి జిల్లా కోర్టు సమన్లు జారీ చేసింది. మరోవైపు సెలబ్రిటీల నుంచి కెల్విన్‌కి మనీ ట్రాన్స్ ఫర్‌ అయినట్టుగా ఇటీవల ఈడీ విచారణలో ఇప్పటికే బయటపడింది. మరి దీనిపై ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story