Bro Success Meet: మావయ్య, త్రివిక్రమ్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు : తేజ్

Bro Success Meet: మావయ్య, త్రివిక్రమ్ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు : తేజ్
ఘనంగా 'బ్రో' విజయోత్సవ సభ.. వేడుకలో పాల్గొన్న పలువురు సినీ ప్రముఖులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటించిన చిత్రం 'బ్రో' ఇటీవలే విడుదలై... బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. జీ స్టూడియోస్ తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి. విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతో తాజాగా మేకర్స్... విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో చిత్ర బృందంతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

సముద్రఖని తన ప్రయాణాన్ని చిన్నగా మొదలుపెట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చారని హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సందర్భంగా చెప్పారు. ఇక థమన్ నేపథ్య సంగీతంతో కట్టిపడేసాడని, కళ్యాణ్ మావయ్య గురించి, త్రివిక్రమ్ గారి గురించి మాట్లాడే అంత అర్హత తనకు లేదన్నాడు. త్రివిక్రమ్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువేనన్న ఆయన.. ఆయన తనను నమ్మి, తాను పూర్తిగా కోలుకునే వరకు సముద్రఖని గారిని వెయిట్ చేయించారని చెప్పారు. ఇక "మేమందరం కలిసి ఒక మంచి సినిమాని మీ ముందుకు తీసుకొచ్చాము. అందరూ ఈ సినిమా గురించి ఇంత గొప్పగా మాట్లాడటం, ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడం సంతోషంగా ఉంది" అని దర్శకుడు సముద్రఖని అన్నారు.

ఈ సినిమాలో భాగం కావడం అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నానన్న హీరోయిన్ కేతిక శర్మ.. దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్ లవ్లీ కో స్టార్ అని, థమన్ గారి సంగీతం ఎంతగానో ఆకట్టుకుందని ఆమె చెప్పారు. "పవన్ కళ్యాణ్ గారు, సాయి ధరమ్ తేజ్ గారి కలయికలో మా 25 వ సినిమా చేయడం సంతోషంగా ఉంది. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయడానికి ప్రధాన కారణం సముద్రఖని గారు. ఇంత మంచి సినిమాని, త్రివిక్రమ్ గారు తన సంభాషణలతో ప్రేక్షకుల హృదయాల్లోకి తీసుకెళ్లారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే చిత్రమిది. మామూలుగా నాకు సినిమా చూసేటప్పుడు ఫోన్ చూసే అలవాటు ఉంటుంది. అలాంటిది ఈ సినిమా చూసేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ చూడలేదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు" అని నిర్మాత టి.జి. విశ్వప్రసాద్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

"వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు పనిచేయడానికి కారకులైన ఆయనకు రుణపడి ఉంటాను. నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్ గారే. సముద్రఖని గారు నాకు 20 ఏళ్ళ ముందు నుంచే తెలుసు. ఆయన మట్టి మనిషి. వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎంత బాగుంటుందో అంత స్వచ్ఛంగా ఉంటాం. ఈ సినిమా వల్ల ఆయనతో నా అనుబంధం మరింత బలపడింది. పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి తేజ్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డాను. అంత ఇష్టం సాయి అంటే. మనసుకి చాలా దగ్గరైన మనిషి. అందుకే సాయి తేజ్ సినిమాకి మనసుతో పని చేస్తాను. క్లయిమాక్స్ లో నా సంగీతంతో సాయి తేజ్ పై ప్రేమని చూపించాను. పవన్ కళ్యాణ్ గారిని టైంగా చూస్తూ నేపథ్య సంగీతాన్ని మరింత బాధ్యతతో చేశాను. ఇంతమంచి సినిమాని ఇచ్చిన సముద్రఖని గారికి థాంక్స్" అని సంగీత దర్శకుడు ఎస్.థమన్ చెప్పారు.

ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాలో కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఎస్.థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రం జూలై 28న విడుదలై విశేష ఆదరణ పొందుతోంది. 'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' భారీ వసూళ్లతో దూసుకుపోతూ హ్యాట్రిక్ విజయాన్ని అందించింది.


Tags

Read MoreRead Less
Next Story