KBR పార్కులో నటిపై దాడి..దర్యాప్తు ముమ్మరం..!
KBR పార్కులో నటి షాలూ చౌరాసియాపై దాడి చేసిన విచారణ వేగవంతం చేశారు పోలీసులు. బంజారాహిల్స్ లా అండ్ ఆర్డర్, క్రైం పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి నిందితుని కోసం వెతుకుతున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే నిందితుని కోసం గాలింపు ముమ్మరం చేశారు. వాకింగ్కు వచ్చినవారి కదలికలపైనా ఆరా తీస్తున్నారు.
పార్కు చుట్టూ షాప్స్ దగ్గర ఉన్న 73 సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఐతే ఎక్కడా స్పష్టత లేకపోవడంతో పార్కు చుట్టూ రోడ్లపై ఉన్న సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. గతంలో నేరాలకు పాల్పడిన వారి వివరాలను సేకరిస్తున్నారు. మరోవైపు బాధిత నటి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. చౌరాసియా నుంచి నిందితుడు చోరీ చేసిన ఫోన్ను కొద్దిసేపటికే స్పిచ్ఛాఫ్ చేశాడు. ఎక్కడ స్విచ్ఛాఫ్ చేశాడో ఆ ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. అటు వైపు చుట్టుపక్కల సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.
సెల్ఫోన్లో మరో సిమ్కార్డు వేస్తే సెల్ టవర్ ఆధారంగా గుర్తించేందుకు అవకాశం ఉండడంతో సాంకేతిక ఆధారాలపైనా దృష్టి పెట్టారు. షాలూ చౌరాసియానే లక్ష్యంగా చేసుకోవడం.. ఫోన్ లాక్కెళ్లడానికి కారణాలెంటనే కోణంలో విచారణ జరుపుతున్నారు పోలీసులు.
"ట్వంటీ ఫోర్", "సైకో, కాలింగ్ సహస్ర" లాంటి మూవీస్ ఫేమ్ 'షాలూ చౌరాసియా'.. ఆదివారం సాయంత్రం KBR పార్కుకు వాకింగ్ కు వచ్చింది. పార్కు చుట్టూ వాక్ వేలో నడుస్తుండగా వెనకాలే వచ్చిన దుండగుడు.. ఆమెను అడ్డగించి గట్టిగా పట్టుకుని కింద పడేశాడు. నోట్లో గుడ్డలు కుక్కి.. రెండు చేతులు వెనక్కి విరిచి బండరాయి పెట్టాడు. మరో కాలుతో గట్టిగా నొక్కిపెట్టాడు. అరిస్తే చంపేస్తానంటూ మరో బండరాయి ఎత్తి బెదిరించినట్లు నటి తన ఫిర్యాదులో పేర్కొంది. సెల్ ఫోన్ లాక్కుని పార్క్ వాక్ వేను అనుకుని ఉన్న ఫెన్సింగ్ దూకి పారిపోయినట్లు చెప్పింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com