యాసిడ్ దాడిలో గాయపడిన అక్కను యోగా కాపాడింది: కంగనా రనౌత్
కంగనా రనౌత్ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా తన సోదరి రంగోలి చందేల్కు యాసిడ్ దాడి యొక్క గాయం నుండి బయటపడటానికి సహాయపడిందని చెప్పారు. అక్క రంగోలికి 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఓ వ్యక్తి ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు. అక్క తిరస్కరించడంతో అతడు ఆమెపై ఆగ్రహంతో యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే అక్కకు వైమానిక దళ అధికారితో నిశ్చితార్థం జరిగింది.
కానీ యాసిడ్ దాడి జరిగిన తరువాత అతడు నిశ్చితార్థం క్యాన్సిల్ చేశాడు. కనీసం అక్కని చూడడానికి కూడా రాలేదు. యాసిడ్ దాడి కారణంగా ఆమెకు ఒక కంటిలో దృష్టిని కోల్పోయింది. చెవి కాలిపోయింది. చెస్ట్ తీవ్రంగా దెబ్బతింది. మూడు సంవత్సరాల్లో ఆమెకు 53 ఆపరేషన్లు చేయవలసి వచ్చింది. ఆ సమయంలో అక్క ఎవరితో మాట్లాడేది కాదు. మానసికంగా చాలా కృంగి పోయింది. షాక్లో ఉందని డాక్టర్లు చెప్పారు. అప్పుడు నేను యోగాకి వెళుతూ అక్కని కూడా తీసుకువెళ్లేదాన్ని.
దాంతో క్రమంగా ఆమె మానసిక స్థితి మెరుగు పడింది. ఇప్పుడు ధైర్యంగా జీవితాన్ని సాగిస్తోంది. యోగా ఒత్తిడినుంచి బయటపడడానికి ఉపకరిస్తుంది. మానసిక స్థితిని మెరుగు పరుస్తుందని అక్క రంగోలి జీవితంలో జరిగిన విషాద సంఘటనను యోగా డే నాడు గుర్తు చేసుకుంది కంగనా రనౌత్. మానసికంగా మరియు శారీరకంగా కోలుకోవడానికి యోగా సహాయపడుతుందని వివరించింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com