బోనాల పాట పై మంగ్లీ వివరణ..!

బోనాల పాట పై మంగ్లీ వివరణ..!
లేటెస్ట్ గా సింగర్ మంగ్లీ పాడిన 'చెట్టు కింద కూసున్నవమ్మ' పాట యూట్యూబ్‌లో ఓ రేంజ్ లో దుమ్ముదులుపుతుంది.

లేటెస్ట్ గా సింగర్ మంగ్లీ పాడిన 'చెట్టు కింద కూసున్నవమ్మ' పాట యూట్యూబ్‌లో ఓ రేంజ్ లో దుమ్ముదులుపుతుంది. అయితే అదే స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. అమ్మవారిని మోతెవరి అంటూ సంబోధించడంతో కొందరు నెటిజన్లు సింగర్‌ మంగ్లీ మీద ఫైర్ అవుతున్నారు. ఏకంగా దీనిపైన పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఈ పాటపై మంగ్లీ వివరణ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది.

" ఈ పాటను ప్రఖ్యాత జానపద పాటల రచయిత, గాయకులు ,80 సంవత్సరాలు కలిగిన పెద్దాయన పాలమూరు రామస్వామి గారు 25 ఏళ్ళ క్రితమే రచించారు. పాలమూరు ప్రాంతంలో కోలాటంలో ఈ పాట చాలా ప్రసిద్ది. 2008లో ఈ పాటను DRC ఆడియో సంస్థవారు సిడీ రూపంలో కూడా విడుదల చేశారు. ఆ పెద్దాయన రాసిన జానపదాలు నాకు చాలా ఇష్టం. ఆయన మీద అభిమానంతో స్వయాన ఆయన్ని కలిసి ఈ పాటను తీసుకోవడం జరిగింది. ఈ పాట వీడియోలో రామస్వామిగారిని కూడా చిత్రీకరించాము. 300 జానపదాలతోపాటు గ్రామదేవత మైసమ్మ మీద ఆయన వంద కోలాటం పాటలు రచించారు. ఆ పాటలన్ని నిందాస్తుతిలోనే ఉన్నాయి.

''చెట్టుకింద కూసున్నవమ్మ చుట్టం లెక్క ఓ మైసమ్మ'' అని సాగే ఈ పాటలో 'మోతెవరి' అనే పదంపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రచయిత రామస్వామిగారి అభిప్రాయం ప్రకారం మోతెవరి అంటే గ్రామంలో పెద్ద అనే అర్థంలో ఈ పాట సాగుతుంది. ప్రస్తుతం ఆ పదం వ్యతిరేక పదంగా వాడుకలోకి వచ్చిందన్నది వాదన. నిందాస్తుతిలో కోలాటం రూపంలో సాగే ఈ పాటను మాకు తెలిసిన కొంతమంది కళాకారులు,పెద్దల సలహాలు తీసుకుని చిత్రీకరించాము. గ్రామదేవతల ఒగ్గు కథలు, బైండ్లోల కొలుపులు ఇలా రకరకాల ఆచారాలు ఉన్నాయి.భక్తిలో కూడా మూఢ భక్తి,వైరి భక్తి అని రకరకాలుగా ఉన్నాయి.. అందులో భాగంగానే ఈ పాటను రూపొందించాము.

నేను పండితుల కుటుంబం నుంచి రాలేదు. చెట్లు, పుట్టలను కొలిచే గిరిజన జాతికి చెందిన తండా నుంచి వచ్చిన ఆడబిడ్డను. బతుకమ్మ, బోనాలు పండగల్లాగే మా బంజారాలో తీజ్, శీతలా (సాతి భవాని) పండగల్లో పకృతినే దేవతలుగా పూజిస్తాము. మాకు కష్టం కలిగినా సంతోషం వొచ్చినా మేము చెప్పుకునేది నమ్ముకున్న గ్రామదేవతలకే. వారిని మా ఇంట్లో సభ్యులుగా నమ్ముతాము. మేము తినేదే, తాగేదే ఆ దేవతలకు నైవేద్యంగా పెడతాము.

నేను సింగర్ గా అంతో ఇంతో ఎదిగింది కూడా అమ్మవారి కృప, ఆంజనేయ స్వామి దీవెన, మీ అభిమానం, ఆదరణ వళ్ళనే అని నమ్ముతాను. అందుకే నేను పుట్టిన తండాలో ఆంజనేయ స్వామి గుడికట్టించాను. మా తాతలనాటి ఆంజనేయస్వామి విగ్రహానికి గుడికట్టించి నేడు ధూప దీప, నైవేద్యాలతో పూజలు చేస్తున్నాము. నీకు గుడికట్టించే ధైర్యం, పేరు నాకు ఇవ్వాలి స్వామి అని మొక్కుకున్నాను. ఆ దేవుని దయవల్ల గత ఏడాది నవంబర్ 19న నా మొక్కును తీర్చుకున్నాను.

ఏనాడు గుడికి వెళ్ళని వాళ్ళు, బోనం ఎత్తని వాళ్ళు కూడా నా జాతి, ప్రాంతం, కులం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసమో గమనించాలి. గత నాలుగేళ్లుగా ప్రతీ ఏటా లాల్ దర్వాజ అమ్మవారికి బోనం ఎత్తుతున్నాను. గత ఆరు సంవత్సరాలుగా బతుకమ్మ, సమ్మక్క సారక్క, శివరాత్రి, సంక్రాంతి, బోనాలు ఏ పండగ వచ్చినా నేను పాటలు చేస్తున్నాను. ఈసారి శివరాత్రి పాట అత్యంత పవిత్ర స్థలం కాశీకి వెళ్ళి మరీ చిత్రీకరించాము. ప్రతి పండగలో నా పాటల ద్వారా నేను మీ ఇంటి భాగస్వామినయ్యాను. నా పాటను ఆదరించారు, అభినందించారు. నన్ను మీ ఇంట్లో ఓ ఆడబిడ్డగా కడుపులోపెట్టుకున్నారు. ఇంత అదృష్టం, అవకాశం కల్పించిన మీకు నేనెప్పటికీ రుణపడి ఉంటాను.

ఒక్క రోజులో నేను ఫేమస్ కాలేదు. నా పాటల వెనక పదేళ్ళ కష్టం ఉంది. కానీ కొందరు తమ ఇంట్లో తల్లి, చెల్లి ఉందన్న విషయం మరిచి విచక్షణ కోల్పోయి కామెంట్లు చేస్తున్నారు. ఈ పాట నేపథ్యం తెలుసుకోకుండా నిందిస్తున్నారు. గ్రామదేవతలను ఎలా కొలుస్తారు, మైసమ్మ కొలుపు పాటలు, నిందాస్తుతి సాహిత్యం గురించి తెలుసుకొని విమర్శలు చేస్తే విజ్ఞతగా ఉండేది. ఈ పోస్టు నా మనసుకు బాధకలిగించిన వారికోసము, నన్ను అభిమానించేవారి మనసుకు కష్టం కలిగించిన వారి కోసంఈ పాటపై విమర్శలు వచ్చినరోజే పాటను మార్చే అవకాశం ఉన్నప్పటికీ, పాటకోసం ప్రాణంపెట్టిన 80 ఏళ్ల వృద్ద రచయిత రామస్వామిగారిని తక్కువ చేయవద్దనే ఉద్దేశ్యంతో, ఆయన్ని గౌరవించి ఈ నిర్ణయం తీసుకోలేకపోయాను.

కానీ దీన్ని మరింత వివాదం చేసి ఆయన్ని కూడా కించపరుస్తున్నారని, ఆ పెద్దాయన కుటుంబ సభ్యుల అనుమతితో లిరిక్స్ లో మార్పులు చేశాము. నన్ను వ్యతిరేకించినవారు, నిందించినవారు అందరూ కూడా నా వాళ్ళే అనుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. " అంటూ మంగ్లీ పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story