ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు

ముగిసిన సిరివెన్నెల అంత్యక్రియలు.. మహాప్రస్థానంలో అంతిమ సంస్కారాలు
sirivennela seetharama sastry : ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు పూర్తయ్యాయి.

sirivennela seetharama sastry : ఆత్మీయులు, అభిమానుల అశ్రునయనాల మధ్య సిరివెన్నెల అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఫిల్మ్‌నగర్‌లోని మహాప్రస్థానంలో శాస్త్రపరంగా అంతిమ సంస్కారాలు జరిగాయి. కడసారి చూపు కోసం సినీ పరిశ్రమలోని ప్రముఖులు, 24 విభాగాల వాళ్లంతా తరలి వచ్చారు. పలువురు రాజకీయ ప్రముఖులు సైతం సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. పాటలతో చైతన్యం నింపిన పాటలరేడు.. అలా అచేతనంగా ఉండడం చూసి కన్నీళ్లు ఆగలేదు. సిరివెన్నెలతో ఆత్మీయ బంధం ఏర్పరుచుకున్న వారంతా కన్నీరు పెట్టుకున్నారు. ఆ కలం ఇక రాయదని, సిరి లోగిలి నుంచి ఇకపై పాటలు రావని తలచుకుంటూ.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకున్నారు. పదంతో సమాజాన్ని కదిపిన సిరివెన్నెల ఆఖరి మజిలీలో.. నేను సైతం అంటూ పదం కలిపారు అభిమానులు.

సిరివెన్నెల కురిపించి.. ఇక సెలవంటూ వెళ్లిపోయిన సీతారామశాస్త్రి మరణాన్ని తెలుగు చిత్రసీమ తట్టుకోలేకపోతోంది. ఆ పాటసారిని, ఆయన పాటను ప్రాణంగా ప్రేమించిన వారందరి హృదయాలు.. అంతులేని వేదనతో సుడిగుండాలు అయ్యాయి. మాటలకందని విషాదం గుండెల్ని పిండేస్తుంటే.. బరువెక్కిన హృదయాలతో అక్కడికి వచ్చిన వారందరికి కళ్లలోనూ నీటిసుడులు తిరిగాయి. సినీరంగంతో అనుబంధం ఉన్నవారితోపాటు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు అంతా సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. ప్రతి ఒక్కరితోనూ ప్రత్యేకమైన అనుబంధాన్ని ఏర్పరుచుకుని, వెలకట్టలేని అభిమానాన్ని పొందారు కాబట్టే.. ఆయన ఇక లేరనే వార్త ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు సినీరంగానికి సీతారామశాస్త్రి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదంటూ ఉద్వేగానికి గురవుతున్నారు. ఈ అంతులేని విషాదం అలుముకున్న వేళ.. సిరివెన్నెల కుటుంబాన్ని ఓదార్చడం ఇప్పుడు ఎవరివల్లా కావడం లేదు.

36 ఏళ్ల సినీప్రస్థానం.. 3 వేలకుపైగా పాటలు.. ప్రతిదీ ప్రత్యేకమే. అనుభవం నేర్పిన పాఠాలతో కాలానికి తగ్గట్టు మారుతూ, తన పాటనూ సరికొత్తగా మలుస్తూ.. పెన్‌ పవర్‌ చూపిస్తూ తనదైన ముద్ర వేశారు సిరివెన్నెల. అందుకే ఇప్పటి కుర్రహీరోలకు సైతం ఫేవరిట్ లిరిసిస్ట్‌గా నిలిచారు. తోటి గీతరచయితలతోనూ చెరిగిపోని, చెదిరిపోని ఆత్మీయబంధం ఏర్పరచుకున్నారు. అందుకే.. సిరివెన్నెల లేరనే నిజాన్ని ఎవరూ తట్టుకోలేకపోతున్నారు.

సన్నివేశం చెప్తే చాలు.. దానికి దృశ్యరూపం ఇవ్వడంలో సిరివెన్నెల కలానికి తిరుగేలేదు. ఎందరో ప్రొడ్యూసర్లు ముచ్చటపడి ఆయనతో పాటలు రాయించుకున్నారు. దర్శకులు తమ అభిరుచికి తగ్గట్టు సరికొత్త ప్రయోగాలు చేయించారు. డైరెక్టర్లకు ఏంకావాలో క్లారిటీగా చెప్తే చాలు.. సీతారామశాస్త్రి కలం నుంచి జాలువారే అక్షరాలే మొత్తం దృశ్యాన్ని కళ్లకు కట్టేస్తాయి. సన్నివేశానికి అదనపు బలాన్ని తెచ్చిపెడతాయి. చాలాసార్లు ఆ పాటల్లోని మాటలే సినిమాకు ఆయువుపట్టుగా మారిన సందర్భాలూ ఉన్నాయి. ఆయనలో గీతరచయిత ఎలాంటి అద్భుతాలు చేస్తాడో చెప్పడానికి నిదర్శనాలు కోకొల్లలు. సాహిత్యానికి పట్టం కడుతూ పాట రాయాలన్నా.. సరళంగా సాగిపోయే పదాలతో యువతను ఉర్రూతలూగించాలన్నా.. అది ఆయనకే చెల్లింది. అందుకే.. ఆయన మరణాన్ని తట్టుకోలేక కోట్ల హృదయాలు మౌనంగా రోదిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story