Kushi Musical Concert : ఆగస్టు 15న 'ఖుషి' మ్యూజికల్ కన్సర్ట్

Kushi Musical Concert : ఆగస్టు 15న ఖుషి మ్యూజికల్ కన్సర్ట్
'ఖుషి' మ్యూజికల్ కన్సర్ట్.. మూవీపై మరింత హైప్ పెంచేందుకు ప్లాన్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన 'ఖుషి'.. ఈ ఏడాది తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి. ఆగస్టు 15న సినిమా పాటలతో కూడిన మ్యూజికల్ కన్సర్ట్ ను నిర్వహించనున్నట్లు టీమ్ తాజాగా ప్రకటించింది. ఇటీవలే ఈ రొమాంటిక్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజై.. అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ వీడియో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమాలోని పాటలు, మ్యూజిక్ కు విశేషమైన స్పందన వస్తోంది. ఈ రెస్పాన్స్ కు మరింత ఉత్సాహం కలిగించేందుకు మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

హైదరాబాద్ లో ఏర్పాటు కానున్న ఈ కన్సర్ట్.. హెచ్‌ఐసీసీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుందని మేకర్స్, విజయ్ దేవరకొండ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "నా ప్రేమికులారా, ది ఖుషి సంగీత కచేరీ. మీ టిక్కెట్లను ఇప్పుడే బుక్ చేసుకోండి. ఆగస్టు 15న మేము కలుస్తాం" అంటూ ఆయన ట్విట్టర్ లో రాసుకువచ్చారు. ఈ సంగీత కచేరీకి విజయ్ దేవరకొండ, సమంతతో పాటు చిత్ర తారాగణం, సిబ్బంది హాజరుకానున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సమంత ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్‌కు హాజరు కాలేదు. కాగా ఈ కచేరీలో హేషమ్ అబ్దుల్ వహాబ్, సిద్ శ్రీరామ్, జావేద్ అలీ, అనురాగ్ కులకర్ణి, హరి చరణ్, చిన్మయి, హరి శంకర్, పద్మజ శ్రీనివాసన్, దివ్య ఎస్ మీనన్, భావన ఇస్వీ ప్రదర్శనలు ఉంటాయని తెలుస్తోంది.

'ఖుషి' గురించి..

'ఖుషి' ట్రైలర్‌ను ఆగస్టు 9న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయరామ్, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, లక్ష్మి, రోహిణి, అలీ, రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మేకర్స్ నిర్మించిన 'ఖుషి' సెప్టెంబర్ 1న విడుదల కానుంది.


Tags

Read MoreRead Less
Next Story