అదరగొట్టిన ముంబై.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో స్థానం..

అదరగొట్టిన ముంబై.. ఐపీఎల్‌ చరిత్రలో రెండో స్థానం..

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఆర్‌సీబీపై విజయం సాధించిన ముంబై ఈ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ముంబై తాను ఆడిన 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, నాలుగు ఓటములతో 16 పాయింట్లు సాధించి దర్జాగా ప్లేఆఫ్‌ చేరింది. ఐపీఎల్‌ చరిత్రలో చెన్నైతర్వాత కనీసం 9సార్లు ప్లే ఆఫ్‌ చేరిన జట్టుగా ముంబై రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆర్‌సీబీ విధించిన 165 పరుగుల లక్ష్యాన్ని ముంబై 19 ఓవర్లలో చేధించింది. ముంబై బ్యాట్స్‌మన్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ 79 పరుగులుతో టాప్‌ స్కోరర్‌గా నిలచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించగా, ఓపెనర్లు డికాక్‌ 18, ఇషాన్‌ కిషన్‌ 25 పరుగులు చేశారు. ఆర్‌సీబీ బౌలర్లలో సిరాజ్‌, చాహల్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

అంతకముందు టాస్‌ గెలిచిన ముంబై ఆర్‌సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించగా.. ఓపెనర్లు దేవదూత్‌ పడిక్కల్‌, జోష్‌ పిలిప్‌లు ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. ముంబై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ఇద్దరు బ్యాట్‌ ఝులిపించడంతో పవర్‌ప్లే ముగిసేసరికి ఆర్‌సీబీ స్కోరు 6ఓవర్లో 54 పరుగులు చేసింది. అయితే జట్టు స్కోరు 71 పరుగులకు చేరగానే జోష్‌ పిలిప్‌ రాహుల్‌ చాహర్‌ బౌలింగ్‌లో స్టంప్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. మరోవైపు వేగంగా ఇన్నింగ్స్‌ ఆడిన దేవదూత్‌ పడిక్కల్‌ కొన్ని చక్కని షాట్లు ఆడి 30 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేయగా కెప్టెన్‌ కోహ్లి అలా వచ్చి ఇలా వెళ్లిపోయాడు. ఏబీ డివిలియర్స్‌ వచ్చీ రాగానే ఫోర్, సిక్సర్‌తో మంచి టచ్‌లో కనిపించినా జట్టు స్కోరు పొలార్డ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే ఒకపక్క వికెట్లు పడుతున్నా దేవదూత్‌ వేగంగా ఆడడంతో ఏ దశలోనూ రన్‌రేట్‌ 8కి తక్కువగా నమోదు కాలేదు.

దీంతో ఆర్‌సీబీ 15 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 130 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత నుంచి ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో ఆర్‌సీబీకి పరుగులు రావడం కష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఆర్‌సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో బుమ్రా 3 వికెట్లతో ఆకట్టుకోగా, బౌల్ట్‌ , పొలార్డ్‌, రాహుల్‌ చాహర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

ఛేదనకు దిగిన ముంబయికి గొప్ప ఆరంభమేమి లభించలేదు. డికాక్‌ ను సిరాజ్‌ ఔట్‌ చేయడంతో 37 పరుగులకు తొలివికెట్‌ కోల్పోయింది. కొద్దిసేపటికే ఇషాన్‌ కిషన్‌ , సౌరభ్‌ తివారి కూడా వెనుదిరిగారు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన కృనాల్ పాండ్య తో కలిసి సూర్యకుమార్ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. అయితే కృనాల్‌ను చాహల్‌ ఔట్‌ చేసి ముంబయిని దెబ్బతీశాడు. వికెట్లు పడుతున్నా మరోవైపు సూర్యకుమార్‌ తన పోరాటం కొనసాగించాడు. రన్‌రేటు నియంత్రణలోనే ఉంచుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 29 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు. అనంతరం మరింత చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు.

Read MoreRead Less
Next Story