ఐపీఎల్ ‌వేలం..విదేశీ ఆటగాళ్లపై కనక వర్షం..అర్జున్ టెండూల్కర్ ధర ఎంతంటే?

ఐపీఎల్ ‌వేలం..విదేశీ ఆటగాళ్లపై కనక వర్షం..అర్జున్ టెండూల్కర్ ధర ఎంతంటే?
అర్జున్ టెండూల్కర్‌ని సొంతం చేసుకొనేందుకు మరే ఇతర ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు.

సంచలనాలకు వేదికైన ఐపీఎల్‌-2021 వేలం ముగిసింది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఒకటిని మించి మరొకటి ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. విదేశీ ఆటగాళ్లపై కనక వర్షం కురిపించాయి. ఐపీఎల్‌ -2021 ఆటగాళ్ల వేలం చెన్నైలో నిర్వహించారు. సౌతాఫ్రికా ఆల్‌రౌండర్‌ క్రిస్ మోరిస్‌ ఐపీఎల్‌ వేలంలో సంచలనం సృష్టించాడు. అతడు ఏకంగా 16 కోట్ల 25 లక్షలకు అమ్ముడుపోయి రికార్డు నెలకొల్పాడు. రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్‌ అతడిని భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. క్రిస్ మోరిస్‌ కోసం ముంబై, బెంగళూరు, పంజాబ్‌, రాజస్థాన్ జట్లు పోటీపడి బిడ్లు దాఖలు చేశాయి. కేవలం 75 లక్షల బేస్ ప్రైస్‌తో ఎంట్రీ ఇచ్చిన మోరిస్.. చివరికి రికార్డు ధర పలకడం విశేషం.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్ మాక్స్‌వెల్‌కు ఐపీఎస్‌లో ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. గత సీజన్‌లో అతడికి 10 కోట్లు ఇచ్చినా... పంజాబ్ తరపున దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తం కనీసం ఒక్క సిక్స్ కూడా బాదలేదు. దీంతో ఆ టీమ్‌ మాక్స్‌వెల్‌ను వదులుకుంది. కానీ ఈ సారి.. ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్‌తో వేలంలోకి వచ్చిన మాక్స్‌వెల్‌ కోసం.. ఫ్రాంఛైజీలు పోటీ పడ్డాయి. అతడి కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీల మధ్య తీవ్ర పోటీ వచ్చింది. చివరికి బెంగళూరు మాక్స్‌వెల్‌ను.. 14 కోట్ల 25 లక్షలకు కొనుగోలు చేసింది.

ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను 2 కోట్ల 20 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ దక్కించుకుంది. అతడి కనీస ధర 2 కోట్లు ఉండగా.. బిడ్‌ను ఆర్సీబీ ఓపెన్ చేసింది. ఆపై ఢిల్లీ మరో 20 లక్షలు వేసింది. అయితే మిగిలిన ఫ్రాంచైజీలు.. స్మిత్‌ కోసం బిడ్డింగ్‌కు వెళ్లలేదు. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్మిత్‌ను 2 కోట్ల 20 లక్షలకు దక్కించుకోగా.. అతడికి జాక్ పాట్ లభించలేదు. గత సీజన్‌లో స్మిత్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. ఐపీఎల్‌ -13వ సీజన్‌లో 12 కోట్లకుపైగా ధరతో స్మిత్‌ను రాజస్థాన్‌ తీసుకుంది. అయితే.. ఈ సీజన్‌లో స్మిత్‌ను రాజస్థాన్‌ వదిలేసుకోవడంతో.. అతడు వేలానికి రాక తప్పలేదు.

ఇంగ్లండ్ ఆటగాడు మొయిన్‌ అలీ 7 కోట్ల రూపాయల ధర పలికాడు. చెన్నై సూపర్‌కింగ్స్‌ అతడిని వేలంలో దక్కించుకుంది. మొయిన్‌ 2 కోట్ల బేస్‌ ధరతో వేలంలో నిలిచాడు. బంగ్లాదేశ్‌ ఆటగాడు షకిబ్ అల్ హసన్‌ 3 కోట్ల 20 లక్షల ధర పలికాడు. 2 కోట్ల బేస్‌ ధరతో నిలిచిన షకిబ్‌ను కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టు దక్కించుకుంది.

ఇక తొలిసారిగా వేలంలో పేరు నమోదు చేసుకున్న సచిన్‌ టెండూల్కర్‌ కుమారుడు అర్జున్‌ టెండూల్కర్‌ను ముంబయి ఇండియన్స్‌ సొంతం చేసుకుంది. అతడిని సొంతం చేసుకొనేందుకు మరే ఇతర ఫ్రాంచైజీ ఆసక్తి కనబరచలేదు. ముంబయి ఇండియన్స్‌ మాత్రం అర్జున్ టెండూల్కర్‌‌ని రూ.20 లక్షల కనీస ధరకు దక్కించుకుంది. లెప్ట్ హ్యాండ్ పేస్ బౌలర్ అయిన అర్జున్.. వికెట్టు తీయడే కాకుండా భారీ సిక్సర్లూ బాదగలడు.

ఐపీఎల్‌ -2021 సీజన్‌లో 292 మంది ఆటగాళ్ల వేలానికి వచ్చారు. ఈసారి కూడా.. ఐపీఎల్‌ను వివో సంస్థ స్పాన్సర్ చేస్తోంది.


Tags

Read MoreRead Less
Next Story