అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లెలు ఆత్మహత్య..!
పండగ పూట విషాదం నెలకొంది.. అన్నయ్య రాఖీ కట్టించుకోలేదని చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆదివారం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. మాణిక్ప్రభు వీధికి చెందిన బొగ్గుల మమత(20) ఇద్దరు అన్నయ్యలు, ఇందులో ఒకరికి పెళ్లి అవ్వడంతో వేరుగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఇంట్లో అమ్మానాన్నలతోపాటు చిన్న అన్నయ్యతో కలిసి మమత ఉంటుంది. అయితే గత పది రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో అన్నాచెల్లెళ్ల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం మమత తన చిన్నఅన్నయ్య రమేష్కు రాఖీ కట్టేందుకు సిద్ధం కాగా అందుకు అతను నిరాకరించాడు. రాఖీ కట్టుకోవాలని పలుమార్లు వేడుకున్నప్పటికి వినకుండా ఇంటినుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదు. అయితే అప్పటికే తల్లిదండ్రులిద్దరూ పొలం పనులకి వెళ్ళడంతో ఇంట్లోని ఫ్యానుకు ఉరి వేసుకుని మమత బలవన్మరణానికి పాల్పడింది. పండగ పూట విషాదం నెలకొనడంతో మమత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికంగా ఈ ఘటన అందరిని కలిచివేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com