మద్యం మత్తులో కూతుళ్లపై తండ్రి దారుణంగా..
మద్యం మత్తులో కూతుళ్లపై దాడికి తెగబడ్డాడో కసాయి తండ్రి. ఏకంగా గొంతు కోసి హతమార్చే యత్నం చేశాడు. ఈ ఘటన సిద్ధిపేట జిల్లా చిట్టాపూర్లో చోటు చేసుకుంది. మహారాష్టకు చెందిన మహ్మద్... భార్యతో గొడవకు దిగాడు. అయితే భార్య ఇంట్లో లేని సమయంలో ఇదే అదునుగా భావించి... తన ఇద్దరి కూతుర్లను హత్య చేసే ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కలవారి సమాచారంతో పోలీసులు... ఈ ఇద్దరి చిన్నారులను కాపాడారు.
మాంసం విక్రయ వ్యాపారం చేస్తున్న మహ్మద్కు ఇద్దరు భార్యలున్నారు. మొదటి భార్య జమిరిద్బికు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. అయితే తరచూ జమిరిద్బితో మహ్మద్ గొడవ పడేవాడని తెలుస్తోంది. భార్య జమిరిద్, కొడుకు ఫయాజ్లు బయటకు వెళ్లిన సమయంలో మహ్మద్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంట్లో గడియపట్టి... ఇద్దరి కూతుర్ల గొంతు కోసేందుకు యత్నించాడు.
విషయం తెలుసుకున్న ముగ్గురు కానిస్టేబుళ్లు... ఆ ఇంటి తలుపులు బద్దలకొట్టి చిన్నారులను రక్షించారు. అయితే అప్పటికే ఒక పాప గొంతును కోశాడు కిరాత తండ్రి మహ్మద్. అడ్డం వచ్చిన కానిస్టేబుళ్లపై కూడా దాడి చేశాడు. గాయపడిన చిన్నారులను ఆస్పత్రికి తరలించి... నిందితుడు మహ్మద్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇద్దరి చిన్నారులకు ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com