దీక్షిత్రెడ్డిని కిడ్నాప్ చేసింది.. చంపింది ఒక్కడే..!!
మహబూబాబాద్లో తొమ్మిదేళ్ల బాలుడు దీక్షిత్రెడ్డి కిడ్నాప్ కథ విషాదాంతమైంది. బాలుణ్ని కిడ్నాప్ చేసిన దుండగులు అతి కిరాతకంగా హత్య చేశారు.. దొరికిపోతామనే భయంతో అక్కడే మృతదేహాన్ని దహనం చేశారు.. తాళ్లపూసపల్లి పరిసరాల్లో గుట్టపై బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.. కిడ్నాప్ చేసింది.. చంపింది ఒక్కడేనని నిర్ధారణకు వచ్చారు.. నిందితుణ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
పోలీసులు ఈ కేసును సవాల్గా తీసుకుని దర్యాప్తు చేపట్టారు.. తెలిసిన వారి పనే అని ముందుగానే అనుమానించిన పోలీసులు ఆ దిశగా అన్ని కోణాల్లో విచారించారు. మెకానిక్గా పనిచేస్తున్న శనిగపురం గ్రామానికి చెందిన మందసాగర్ బాలుణ్ని కిడ్నాప్ చేసినట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు.. త్వరగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే దీక్షిత్రెడ్డిని కిడ్నాప్ చేసినట్లు చెప్పారు.
ఈనెల 18న సాయంత్రం ఆరు గంటల సమయంలో మందసాగర్ బాలుణ్ని ఎత్తుకెళ్లాడు.. కిడ్నాప్ చేసే ముందు రెక్కీ నిర్వహించాడు. సీసీ కెమెరాలు ఎక్కడెక్కడున్నాయో ముందుగానే తెలుసుకున్న మందసాగర్.. పథకం ప్రకారం సీసీ కెమెరాల కంట పడకుండా బాలుణ్ని బైక్పై ఎత్తుకెళ్లాడు.. తెలిసిన వ్యక్తే కావడంతో దీక్షిత్ రెడ్డికి కూడా అనుమానం రాలేదు.. అతని వెంట బైక్ పై వెళ్లాడు.. అక్కడ్నుంచి బాలుణ్ని నేరుగా దానమయ్య గుట్టపై మీదకు తీసుకెళ్లాడు.. అయితే, అప్పటికే అనుమానం వచ్చిన బాలుడు అతన్ని ప్రశ్నించాడు.. దీంతో దొరికిపోతామని భయంతో గొంతు నులిమి దీక్షిత్ రెడ్డిని హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే దహనం చేశాడు మందసాగర్.. హత్య చేసిన తర్వాత రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాలుడి తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.. మొబైల్ నుంచి ఫోన్ చేస్తే దొరికిపోతాననే భయంతో ఇంటర్నెట్ కాల్ ద్వారా వారితో మాట్లాడాడు. అడిగినంత డబ్బు ఇవ్వకుంటే దీక్షిత్ రెడ్డిని చంపేస్తామని బెదిరించాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com