హేమంత్ హత్య కేసు.. జూన్ 10న ఇంట్లో కరెంట్ లేకపోవడంతో..
హేమంత్ కేసును పరువు హత్యగానే తేల్చిన పోలీసులు.. పూర్తి వివరాలు రాబట్టేందుకు నిందితుల్ని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ ఘటనలో 25 మంది నిందితుల్ని కస్టడీ కోరుతూ ఎల్బీనగర్ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు అనుమతితో వారిని కస్టడీకి తీసుకుని సీన్ రీకన్స్ట్రక్ట్ చేయాలని.. పూర్తి వివరాలతో దోషులెవరో తేల్చాలని పోలీసులు భావిస్తున్నారు. కులాంతర వివాహం చేసుకున్నందుకే సుపారీ గ్యాంగ్తో కలిసి మేనమామ యుగంధర్రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి హత్య చేయించినట్టు.. ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. అవంతి ప్రేమ విషయం తెలిసిన తండ్రి లక్ష్మారెడ్డి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టించాడు. 6 నెలలపాటు అవంతి బయటకు వెళ్లకుండా కట్టడి చేశారు. ఐతే.. జూన్ 10న ఇంట్లో కరెంట్ లేకపోవడంతో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసి గుర్తించిన అవంతి అదే రోజు హేమంత్తో వెళ్లిపోయింది. ఇక అప్పటి నుంచి పగతో రగిలిపోయిన కుటుంబ సభ్యులు పథకం ప్రకారమే ఈ హత్య చేయించినట్టు పోలీసులు చెప్తున్నారు. అటు, ఈ కేసులో ఇవాళ పోలీసులకు ఏ4 నిందితుడు రాజు లొంగిపోయాడు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com