Hetero Drugs IT Raids: తవ్విన కొద్దీ డబ్బు.. లెక్కపెట్టడానికే రెండు రోజులు..

Hetero Drugs IT Raids: తవ్విన కొద్దీ డబ్బు.. లెక్కపెట్టడానికే రెండు రోజులు..
Hetero Drugs IT Raids: హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. తవ్విన కొద్దీ భారీగా నగదు వెలుగులోకి వస్తుంది.

Hetero Drugs IT Raids: హెటిరో డ్రగ్స్‌లో ఐటీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. తవ్విన కొద్దీ భారీగా నగదు వెలుగులోకి వస్తుంది. ఇప్పటి వరకు దొరికిన డబ్బును లెక్కపెట్టడానికే అధికారులకు రెండ్రోజులు పట్టిందంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. డబ్బునంతా అట్టపెట్టలు, ఇనుప బీరువాల్లో దాచిపెట్టారని చెబుతున్నారు ఐటీ అధికారులు. గత కొన్ని రోజులుగా హెటిరోపై ఐటీశాఖ చేస్తున్న దాడులతో దిమ్మతిరిగే విషయాలు బయటకొస్తున్నాయి. కోట్లకు కోట్ల రూపాయల నోట్ల కట్టలు చూసి షాకవడం అధికారుల వంతైంది.

కేవలం డబ్బును దాచిపెట్టడం కోసమే హెటిరో సంస్థ.. కొన్ని చోట్ల అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేసిందంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దొరికిన డబ్బులో అధికారులు ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే సీజ్‌ చేశారని, 30 ప్రాంతాల్లో ఈ సొమ్మును కనిపెట్టారని తెలుస్తోంది. ఒక్కో బీరువాలో దాదాపు ఐదు కోట్ల రూపాయల కరెన్సీ నోట్లు ఉన్నాయని తేల్చారు.

ఒక ప్రాంతంలో.. ఒకేచోట 142 కోట్ల రూపాయలను సీజ్‌ చేశారు. కొవిడ్‌ సమయంలో రెమిడిసివర్‌ డ్రగ్‌ను సేల్‌ చేసింది హెటిరో. మరికొన్ని మెడిసిన్స్‌ను కూడా తయారు చేసి అమ్మింది. ఎక్కడ దాచిపెట్టాలో తెలియనంతగా డబ్బు సంపాదించింది. వచ్చిన ప్రతీ నోట్ల కట్టనూ బీరువాల్లో పెట్టి, తమ సంస్థ కార్యాలయాలు, ప్లాంట్లు, ఫ్యాక్టరీల్లో భద్రపర్చింది.

ఆరు రాష్ట్రాల్లో 60 చోట్ల నాలుగు రోజుల పాటు సోదాలు చేసిన ఐటీ టీమ్‌.. హెటిరో అక్రమ సంపద గుట్టునంతా బయటకు లాగింది. కరోనా వైద్యం పేరుతో జనం మీద పడి దోచుకున్నారని తేల్చింది. హెటిరో సంస్థపై ఐటీ దాడులు, ఆ తర్వాత బయటపడ్డ నోట్ల కట్టలను చూసిన జనం నోరెళ్లబెడుతున్నారు. కరోనా సమయంలో ఆదాయం లేక సామాన్యుడు అవస్థలు పడుతుంటే, ఫార్మసీ కంపెనీలు ఇంతలా దోచుకున్నాయా? అని అవాక్కవుతున్నారు. మందుల పేరుతో జనం రక్తమాంసాలను డబ్బుగా మార్చుకుని బీరువాల్లో దాచిపెట్టుకున్నారంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ పెడుతున్నారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story