NCB మాజీ డైరెక్టర్‌ వాంఖడేకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది

NCB మాజీ డైరెక్టర్‌ వాంఖడేకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది
షారూఖ్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది

నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు సీబీఐ ఉచ్చు బిగిస్తోంది. షారూఖ్‌ కుమారుడు ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదు చేయకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. వాంఖడేతోపాటు మరో నలుగురిపైనా సీబీఐ కేసు నమోదు చేయగా కేసు ఎఫ్ఐఆర్ బయటికి వచ్చింది. సమీర్ వాంఖడే విదేశీ పర్యటనలు, విలువైన చేతి గడియారాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలను వాంఖడే చెప్పలేదని ఎఫ్ఐఆర్‌లో తెలిపింది. డిపార్ట్‌మెంట్‌కు చెప్పకుండా చేతిగడియారాలు కొనుగోలు, అమ్మకాలు జరిపినట్లు గుర్తించారు. ఆ ఖర్చుల వివరాలకు.. వాంఖడే చెప్పిన వివరాలకు పొంతన లేకుండా ఉందని సీబీఐ తెలిపింది.

ఇక సంచలనం సృష్టించిన ముంబై క్రూయిజ్ నౌక డ్రగ్స్ కేసులో బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌పై కేసు నమోదుచేయకుండా ఉండేందుకు సమీర్ వాంఖడే 25 కోట్లు లంచం డిమాండ్ చేశారనే ఆరోపణలపై సీబీఐ విచారణ చేస్తోంది. ఈ ఎఫ్ఐఆర్‌లో వాంఖడేతో పాటు అప్పటి అధికారులు, సాక్షి కేపీ గోసావి, అతడి సన్నిహితుడు సానవిల్లే డిసౌజా పేర్లు ఉన్నాయి. లంచాన్ని 25 కోట్ల నుంచి 18 కోట్లకు తగ్గించారని.. అడ్వాన్సుగా 50 లక్షలు తీసుకుని తర్వాత తిరిగిచ్చేశారని సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది.

మరోవైపు ఎన్‌సీబీ జోనల్‌ డైరెక్టర్‌గా సమీర్ వాంఖడే ఉన్న సమయంలో ఆర్యన్‌ఖాన్‌ను అరెస్ట్ చేశారు. 2021 అక్టోబరులో క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్‌ పార్టీకి సంబంధించి ఆర్యన్‌ ఖాన్‌పై కేసు నమోదు చేయడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆర్యన్‌ఖాన్ 22 రోజులు జైలులో ఉన్నాడు. సరైన ఆధారాలు సేకరించడంలో విఫలయ్యారని ఈ కేసులో ఆర్యన్ ఖాన్‌ బయటికి వచ్చాడు. తర్వాత వాంఖడేపై పలు ఆరోపణలు రావడంతో జోనల్‌ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి విచారణ చేపట్టారు.

ఇక డ్రగ్స్‌ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్‌ ఖాన్‌ ను NCB కార్యాలయానికి తీసుకెళ్లే సమయంలో నిందితుడిని హ్యాండిల్ చేయమని అప్పటి NCB సూపరింటెండెంట్ వి.వి సింగ్ కు ఆదేశాలు అందాయని, నిందితుడు కస్టడీలో ఉన్నట్లు సీన్ ను క్రియేట్ చేయడానికి అతనికి,ఇతర అధికారులకు వాంఖడే ఫ్రీహ్యాండ్ ఇచ్చినట్లు సీబీఐ ఎఫ్ ఐఆర్ లో తెలిపింది.

అయితే సమీర్ వాంఖడేపై వస్తున్న ఆరోపణలను ఆయన భార్య క్రాంతి రేడ్కర్ ఖండించారు. నిజాయితీ గా ఉన్నందుకే సీబీఐ కేసు బహుమతి అని సమీర్ వాంఖడే అన్నారు. తన దేశభక్తికి దక్కిన గౌరవం ఇదని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంట్లో 18 మంది సీబీఐ అధికారులు 12 గంటలు సోదాలు చేశారని తెలిపారు. అందులో 23వేలు, నాలుగు ఆస్తిపత్రాలు లభించాయని.. అవి తాను ఉద్యోగంలో చేరడానికి ముందునుంచే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story