ఎంత క్యూట్గా ఉన్నారు.. ఎందుకు చంపారు ఆ దుర్మార్గులు..
వాళ్లసలు మనుషులేనా.. వాళ్లకసలు హృదయమనేది ఉందా.. అమ్మ కాసేపు కనబడక పోతేనే తల్లడిల్లిపోతారే. అలాంటి చిన్నారులను చంపి ఏం సాదిద్దామనుకున్నారు. అక్రమంగా సంపాదించిన ఆ డబ్బుతో ఎంత కాలం బతుకుదామనుకున్నారు. ముద్దులొలికే ఆ చిన్నారులను చంపడానికి చేతులెలా వచ్చాయి. చిన్నారులను హత్య చేసిన దుర్మార్గులను ఊరి ప్రజలు తిట్టిపోస్తున్నారు.
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ముద్దులొలికే కవల సోదరులను కిడ్నాప్ చేసి హత్య చేసిన కేసులో తీర్పు వచ్చింది. హత్యకు పాల్పడిన ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించిన కోర్టు వారికి వివిధ సెక్షన్ల కింద జీవిత ఖైదు విధించింది. ఈ కిడ్నాప్ మరియు హత్యలో 6 మంది పాల్గొన్నారు. నిందితుల్లో ఒకరు జైలులో ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు విచారిస్తే.. ఆయిల్ వ్యాపారవేత్త బ్రిజేష్ రావత్కు ఇద్దరు కవల పిల్లలు శ్రేయాన్ష్, ప్రియాన్ష్లు. 2019 ఫిబ్రవరి 12 న చిత్రకూట్లో 6 సంవత్సరాల వయసున్న ఆ చిన్నారులిద్దరినీ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. బ్రిజేష్కు ఫోన్ చేసిన కిడ్నాపర్లు మీ పిల్లలు మీకు దక్కాలంటే కోటి రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికిప్పుడు అంత మొత్తం ఎక్కడి నుంచి తేగలనంటూ మొదటి విడతగా 20 లక్షల రూపాయలు చెల్లించారు. మీరడిగిన డబ్బు చెల్లిస్తాము, పిల్లల్ని ఏమీ చేయవద్దు అని అన్నా వినకుండా అమాయక చిన్నారులను అన్యాయంగా చంపేశారు. నిందితులు చిన్నారుల మృతదేహాలను రాళ్లతో కట్టి యమునా నదిలోకి విసిరేశారు.
ఈ సంఘటన మొత్తం రాష్ట్రాన్ని కదిలించింది. సత్నా ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఈ ఉదంతం అసెంబ్లీకి చేరుకుంది. చిన్నారుల హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు రాజు ద్వివేది, పద్మకాంత్ శుక్లాతో సహా లక్కీ తోమర్, విక్రమ్ జీత్ సింగ్, బంటా, రామ్కేశ్ యాదవ్లను పోలీసులు అరెస్టు చేశారు. రామ్కేశ్ యాదవ్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు 2500 పేజీల కేసు షీట్ను కోర్టులో సమర్పించారు. హంతకులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. కోర్టు తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు చిన్నారుల తండ్రి బ్రిజేష్. డబ్బు కోసం తమ చిన్నారులను చంపేసిన ఆ దుర్మార్గులకు ఉరిశిక్ష పడేవరకు పోరాటం చేస్తానని తండ్రి బ్రిజేష్ తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com