Mahbubnagar: ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఉద్యమకారుడి కిడ్నాప్ కలకలం.. తనతో పాటు..

Mahbubnagar: ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఉద్యమకారుడి కిడ్నాప్ కలకలం.. తనతో పాటు..
Mahbubnagar: ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన ఉద్యమకారుడు మున్నూరు రవి, మరో ముగ్గురు కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది.

Mahbubnagar: మహబూబ్‌నగర్‌లో ముగ్గురు వ్యక్తుల అదృశ్యం, అరెస్టు.. ఢిల్లీలో మహబూబ్‌నగర్‌కు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి, మరో ముగ్గురు కిడ్నాప్‌ కావడం కలకలం రేపింది. ఓ నేత అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నందునే అపహరణ ఘటనలు జరుగుతున్నాయన్న చర్చ సాగుతోంది.

మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్‌లు అదృశ్యమయ్యారు. అయితే హైదర్‌ అలీ అనే వ్యక్తిపై ఆ ముగ్గురూ హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు అరెస్టు చూపి.. జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించారు. తాజాగా మహబూబ్‌నగర్‌కు చెందిన మున్నూర్‌ రవి ఢిల్లీలో అపహరణకు గురయ్యారు.

మహబూబ్‌నగర్‌లో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ.. వాటిపై కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు సహచరులతో కలిసి రవి మూడు రోజుల కిందట ఢిల్లీకి వచ్చి.. సౌత్‌ అవెన్యూలోని మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ఫ్లాట్‌లో ఉంటున్నారు.

అక్కడి నుండి రవిని, ఇద్దరు సహచరులను, జితేందర్‌ రెడ్డి డ్రైవర్‌ను బలవంతంగా కార్లలోకి ఎక్కించుకొని వెళ్లిపోయారు. పార్లమెంట్‌కు, రాష్ట్రపతి భవన్‌కు కూతవేటు దూరంలో అపహరణ జరిగినట్లు ఫిర్యాదు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా ఏడెనిమిది మంది వ్యక్తులు వచ్చి బలవంతంగా తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు. తమవారిని అక్రమంగా అరెస్టు చేశారంటూ కుటుంబసభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. అక్రమంగా అరెస్ట్‌ చేసి జైలుకు పంపారని నాగరాజు భార్య గీత, యాదయ్య భార్య నాగమణి ఆవేదన వ్యక్తం చేశారు. కావాలనే కేసులో ఇరికించారని వారు ఆరోపించారు.

Tags

Read MoreRead Less
Next Story