కొడుకుపై టర్పెంటాయిల్ పోసిన తండ్రి.. చికిత్స పొందుతూ బాలుడు మృతి
క్షణికావేశంలో తండ్రి చేసిన పని కొడుకు ప్రాణాలు హరించింది. ఆన్లైన్ క్లాసులకు అసలు అటెండవ్వట్లేదని ఆగ్రహించిన తండ్రి కొడుకుపై టర్పెంటాయిల్ పోసి నిప్పంటించాడు. ఈనెల 18న హైదరాబాద్ కూకట్ పల్లి ఈ సంఘటన జరిగింది. గత మూడు రోజులుగా గాంధీ ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్న చరణ్ మృత్యువుతో పోరాడుతూ తుది శ్వాస విడిచాడు.
నాగర్ కర్నూలుకు చెందిన బాలు అనే వ్యక్తి కేపీహెచ్బీ కాలనీలోని ఓ పాఠశాల ఆవరణలో గుడెసె వేసుకుని నివసిస్తున్నాడు. అతడి భార్య కూడా అదే పాఠశాలలో అటెండర్గా పని చేస్తోంది. వీరి చిన్న కుమారుడు చరణ్ అక్కడి పాఠశాలలోనే ఆరవ తరగతి చదువుతున్నాడు.
సరిగా చదవట్లేదని కొడుకుపై ఆగ్రహించిన తండ్రి.. పెయింటింగులకు ఉపయోగించే టర్పెంటాయిల్ పోశాడు. భార్య అడ్డుకున్నా వినకుండా నిప్పు కూడా అంటించాడు. దీంతో మంటలకు తట్టుకోలేని బాలుడు ఇంటి నుంచి బయటకు పరుగు తీశాడు. ఈ క్రమంలో సమీపంలోని గోతిలో పడ్డాడు. స్థానికులు గుర్తించి ఆ బాలుడిని ఆస్పత్రిలో చేర్పించారు.
గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చరణ్ ఈ రోజు ఉదయం కన్నుమూశాడు. పోలీసులు బాలుడి తండ్రిని అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com