Crime: జగిత్యాలలో కలకలం.. అక్క అనుమానాస్పద మృతి... చెల్లి అదృశ్యం

Crime: జగిత్యాలలో కలకలం.. అక్క అనుమానాస్పద మృతి... చెల్లి అదృశ్యం

జగిత్యాల జిల్లా కోరుట్లలో అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతి చెందడం కలకలం రేపింది. కోరుట్లకు చెందిన బంక శ్రీనివాస్ రెడ్డి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె దీప్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌‌‌గా పని చేస్తోంది. దీప్తి ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం విధానంలో ఇంటి నుంచి పని చేస్తోంది. రెండ్రోజుల క్రితం దీప్తి తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఫంక్షన్ ఉండటంతో కోరుట్ల నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. ఇంట్లో దీప్తి, ఆమె చెల్లెలు మాత్రమే ఉన్నారు. నిన్న ఉదయం ఆమె చెల్లెలు ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లో ఉన్న తల్లిదండ్రులు ఫోన్‌ చేస్తే నిన్న ఉదయం దీప్తి, ఆమె చెల్లెలు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి పక్కింటివారికి ఫోన్‌ చేశారు. పక్కింటివారు వెళ్లి చూడగా ఇంట్లో దీప్తి విగతజీవిగా పడి ఉండటం గమనించారు. దీప్తి చెల్లెలు చందన కూడా ఇంట్లో కనిపించడం లేదు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దీప్తి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఏడాదిన్నర క్రితం చేరారు. ప్రస్తుతం ఇంటి నుంచే పనిచేస్తున్నారు. ఆమె సోదరి చందన బీటెక్‌ పూర్తి చేసి, ఇంటి వద్దే ఉంటున్నారు. వీరి కుమారుడు సాయి బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. బంధువుల గృహప్రవేశం ఉండటంతో ఆదివారం… శ్రీనివాస్‌రెడ్డి, మాధవి హైదరాబాద్‌కు వెళ్లారు. సోమవారం రాత్రి 10 గంటలకు వారిద్దరూ కుమార్తెలతో ఫోన్‌లో మాట్లాడారు. మంగళవారం మధ్యాహ్నం వారికి ఫోన్‌ చేయగా దీప్తి ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. చందన ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ వచ్చిందని చెబుతున్నారు.


ఇంటి ముందున్న వారికి ఫోన్‌ చేయడంతో వారొచ్చి... దీప్తి మృతి చెంది ఉండడాన్ని గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోరుట్ల డీఎస్పీ రవీందర్‌రెడ్డి, కోరుట్ల, మెట్‌పల్లి సీఐలు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీప్తి మృతదేహం సోఫాలో పడి ఉంది. వంట గదిలో రెండు మద్యం సీసాలు, కూల్‌డ్రింక్‌ బాటిల్‌, తినుబండారాల ప్యాకెట్లు కనిపించాయి.


చందన ఆచూకీ కోసం పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరాలను పరిశీలించగా ఆమె, ఓ యువకుడితో కలిసి ఉదయం 5.12 నుంచి 5.16 గంటల వరకు నిజామాబాద్‌ బస్సులు ఆగేచోట కూర్చున్నట్లు గుర్తించారు. కొద్దిసేపటికి నిజామాబాద్‌ వెళ్లే బస్సులో ఎక్కినట్లు రికార్డు అయింది. తండ్రి శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అదృశ్యమైన చందన, ఆమెతో ఉన్న యువకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇంట్లోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయి, వారితో పాటు ఇంకెవరైనా వచ్చి మద్యం తాగారా? చందన ఎందుకు పారిపోయిందనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. త్వరలోనే కేసు మిస్టరీ ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story