'గీతం' నిర్మాణాల కూల్చివేత.. జగన్‌ ఫాసిస్టు ధోరణికి నిదర్శనం : టీడీపీ నేతలు

గీతం నిర్మాణాల కూల్చివేత.. జగన్‌ ఫాసిస్టు ధోరణికి నిదర్శనం : టీడీపీ నేతలు
గీతం యూనివర్సిటీ కూల్చివేతల వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ చర్యను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. మరోవైపు సర్కారు చర్యపై గీతం యాజమాన్యం..

గీతం యూనివర్సిటీ కూల్చివేతల వ్యవహారం పొలిటికల్‌ టర్న్‌ తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ చర్యను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. మరోవైపు సర్కారు చర్యపై గీతం యాజమాన్యం కూడా న్యాయపోరాటానికి సిద్ధమైంది.. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా క్యాంపస్‌లో నిర్మాణాలను అక్రమంగా కూల్చివేస్తున్నారంటూ.. గీతం యూనివర్సిటీ హైకోర్టులో హౌస్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. క్రమబద్ధీకరణ ప్రక్రియ పెండింగ్‌లో ఉండగా.. నిర్మాణాలను కూల్చివేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. అటు కూల్చివేతల విషయంలో యథాతథ స్థితి పాటించాలని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో సోమవారం వరకు కూల్చివేతలు నిలిచిపోనున్నాయి.

గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. యాజమాన్యానికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి కూల్చడం జగన్‌ ఫాసిస్టు ధోరణికి నిదర్శనమంటూ మండిపడుతున్నారు.. తాజాగా ఈ ఘటనపై పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. గీతం వర్సిటీ భూములు కోర్టుల్లో ఉండగా, ఎలాంటి నోటీసులు లేకుండా దుశ్చర్యకు పాల్పడ్డారని మండిపడ్డారు.. ఇది కక్షసాధింపు చర్యేనన్నారు.

గీతం వర్సిటీలో కట్టడాల కూల్చివేతలపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ స్పందించారు.. గీతం సంస్థలపై దాడి హేయమైన చర్యగా అభివర్ణించారు. కూల్చివేతలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతోందని అనగాని అన్నారు.

గీతం యూనివర్సిటీ విషయంలో అనుసరించిన విధానాన్ని అన్ని అక్రమకట్టడాల విషయంలో అనుసరించాలన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌. రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలకు ఒకే పాలసీ ఉండాలన్నారు. అలా కాకుండా.. ప్రతిపక్షంపై కక్ష సాధింపు చర్యలే ప్రభుత్వ విధానంగా కనిపిస్తున్నాయన్నారు. ప్రజా వేదిక తర్వాత ఏ అక్రమ కట్టడాలు కూల్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు ఎమ్మెల్సీ మాధవ్‌.

గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతలపై విమర్శలు పెల్లుబికుతున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది.. కూల్చివేతల్లో ఎలాంటి కక్ష సాధింపు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పుకొచ్చారు.. ప్రభుత్వ భూమిని దురాక్రమణ చేయాలని చూశారని, ప్రభుత్వ స్థలాలు దోచుకునే వారికి వత్తాసు పలకవడం సరికాదన్నారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటే ప్రభుత్వంపై విమర్శలు, ఎదురుదాడి చేయడం తగదని బొత్స అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story