అప్పట్లో నన్ను ఫుట్బాల్ ఆడుకున్నారు.. ఇప్పుడు నేను ఆడుతా
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి రాజకీయాల్లో స్పీడు పెంచారు. కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన గాలిజనార్ధన్ రెడ్డికి తాజా ఎన్నికల సంఘం పార్టీ ఎన్నికల గుర్తును కేటాయింది. ఫుట్బాల్ను ఆయన పార్టీకి కేటాయించింది. ఇక కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 12 మంది అభ్యర్థులతో కూడిన జాబితా, ఎన్నికల మేనిఫెస్టోనూ విడుదల చేశారు. కొప్పల్ జిల్లా గంగావతి నుంచి తాను, బళ్లారి సిటీ నియోజకవర్గం నుంచి తన సతీమణి అరుణలక్ష్మి ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న సమయంలో అందరూ తనను ఫుట్బాల్ ఆడుకున్నారని గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇప్పుడు తానూ వారితో ఫుట్బాల్ ఆడగలనని నిరూపించేందుకు రంగంలోకి దిగానన్నారు. ఐదెకరాల్లోపు భూమి ఉన్న రైతులకు ఏటా 15 వేల ఆర్థిక సాయం, రైతులకు రోజూ 9 గంటల ఉచిత విద్యుత్, గృహిణులకు నెలకు 2వేల 500 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి 250 యూనిట్ల ఉచిత విద్యుత్, నిరుద్యోగ యువతకు నెలకు 2వేల 500 నిరుద్యోగ భృతితో పాటు పలు హామీలతో కూడిన మేనిఫెస్టోను విడుదల చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com