Adani Effect: పార్లమెంట్ లో అదానీ ప్రకంపనలు.. చర్చకు విపక్షాల పట్టు
ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కొనసాగుతోంది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే టైంలో...ప్రతి మంగళవారం..బీజేపీ ఈ సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశంలో ప్రధాన సమస్యలతో పాటు బడ్జెట్పైనా చర్చ జరగనుంది.సభలో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ నేతలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయనున్నారు.
జనవరి 31న రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవగా... ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. తర్వాత పార్లమెంట్లో ఎలాంటి కార్యకలాపాలు జరగలేదు. అదానీ స్టాక్ ఇష్యూపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎలాంటి చర్చకు ఆస్కారం లేకుండాపోయింది. ఉభయసభల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
పార్లమెంట్లో అదానీ గ్రూపు వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. తాము ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను సభాపతులు ఆమోదించకపోవడంతో మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. దీనిపై చర్చించేందుకు విపక్షాలు సమావేశమవుతున్నాయి. అదానీ అక్రమాలపై జేపీసీ లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు కేంద్రం మాత్రం దీనిపై ససే మీరా అంటోంది. ఇప్పటికే ఖరారైన అంశాలపై తప్ప ఇతర విషయాలపై చర్చించేది లేదంటున్నారు. ధన్యవాద తీర్మానంపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్న విపక్షాలు.... అదానీ వ్యవహారంపై ప్రధాని మోదీ జవాబు ఇచ్చేటట్లయితే పార్లమెంటు సజావుగా నడిచేందుకు సహకరిస్తామంటున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com