Bengaluru: దుబాయ్ నుంచి వచ్చి ప్రియుడి చేతిలో బలైంది

Bengaluru: దుబాయ్ నుంచి వచ్చి ప్రియుడి చేతిలో బలైంది
బెంగళూరులో ఎయిర్ హోస్టెస్ హత్య కలకలం; నాలుగు అంతస్థుల మేడపై నుంచి పడి మృతిచెందిన యువతి; ప్రియుడే చంపి ఉంటాడని అనుమానాలు

ప్రియుడిని నమ్మి ప్రేమ పేరిట మరో యువతి బలైపోయింది. ఎంతో ఆనందంగా దుబాయ్ నుంచి రెక్కలు కట్టుకుని బెంగళూరు వచ్చి ప్రియుడి చెంత వాలిన ఆమెను, అతడే మృత్యువై కాటేశాడు. వృత్తిరిత్యా ఎయిర్ హాస్టెస్ అయిన ఆమె ప్రాణాలు అనంత వాయువులో కలసిపోయాయి. ఈమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హత్య దిశగా దర్యప్తు ప్రారంభించారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ కు చెందిన అర్చన(28) ఓ ప్రముఖ విమానయాన సంస్థలో గగనసఖిగా పనిచేస్తోంది. కేరళకు చెందిన ఆదేశ్ బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఓ డేటింగ్ యాప్ ద్వారా ఇరువురూ కలుసుకున్నారని తెలుస్తోంది. ఆరు నెలలుగా వీరిద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం నడుస్తోందని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ మధ్య ఇద్దరి నడుమా కొన్ని రోజులుగా వాదోపవాదాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. ఈ సందర్భంలోనే ఆదేశ్ ను కలసేందుకు దుబాయ్ నుంచి వచ్చిన అర్చన ఆదేశ్ ను కలుసుకుంది. ఇరువురూ సినిమాకు వెళ్లి, తిరిగి వస్తుండగా మరోసారి గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫ్లాట్ కు చేరుకున్న తరువాత కూడా వాగ్వివాదం నడిచినట్లు భావిస్తున్నారు. ఇంతలోనే బహుళ అంతస్థులోని బాల్కనీ నుంచి అర్చన కిందపడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. అయితే ఆమె కావాలనే దూకి ఆత్మహత్య చేసుకుందా, లేక ఆదేశ్ ఆమెను తోసేశాడా అన్న కోణంలో పోలీసులు దర్యప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆదేశ్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story