Kerala : కేరళను వణికిస్తున్న కరోనా వైరస్..!

Kerala : కేరళను వణికిస్తున్న కరోనా వైరస్..!
కేరళను కరోనా వణికిస్తోంది. ఒకప్పుడు కరోనా వైరస్‌ను అణచివేసిన రాష్ట్రం.. ఇప్పుడు దాని ధాటికి విలవిలలాడుతోంది.

కేరళను కరోనా వణికిస్తోంది. ఒకప్పుడు కరోనా వైరస్‌ను అణచివేసిన రాష్ట్రం.. ఇప్పుడు దాని ధాటికి విలవిలలాడుతోంది. వ్యాక్సిన్‌ వేసుకోని వారు, వ్యాక్సిన్‌ వేసుకున్న వారు అన్న తేడా ఏం చూపడం లేదు. రెండు డోసుల టీకా తీసుకున్నా సరే వైరస్ వదిలిపెట్టడం లేదు. తాజా లెక్కల ప్రకారం కేరళలో డబుల్ డోస్ వ్యాక్సిన్‌ తీసుకున్న 40 వేల మందికి కరోనా వచ్చింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు లక్ష ఉంటే..ఒక్క కేరళలోనే 40వేల మంది ఉన్నారు. అంటే.. కేరళను కరోనా ఏ రేంజ్‌లో చుట్టుముట్టిందో అర్థం చేసుకోవచ్చు.

కేరళలో కొత్త వేరియంట్‌ పుట్టుకొచ్చిందా అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. రెండు డోసులు తీసుకున్న వారిని సైతం వైరస్‌ కుదిపేస్తుండడంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆ 40వేల మంది కరోనా శాంపిళ్లను సేకరించి, జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపాలని భావిస్తోంది. ఆ నివేదిక వచ్చిన తర్వాతే కేరళలో ఏ వేరియంట్‌ వ్యాపిస్తోంది? అది కొత్త వేరియంటా కాదా అనే దానిపై పూర్తి స్పష్టత వస్తుందని కేంద్రం చెబుతోంది.

కరోనాను అదుపులోకి తీసుకొచ్చేందుకు వీకెండ్‌ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అక్కడి ఆరోగ్యశాఖ కూడా సమర్ధంగానే పనిచేస్తోంది. అయితే, ఈమధ్య కేరళలో సూపర్‌ స్ప్రెడర్‌ కార్యక్రమాలు బాగా జరిగాయి. పండగలు, జాతరలు జరగడంతో వైరస్‌ బాగా వ్యాపించిందని కొన్ని రిపోర్టులు చెబుతున్నాయి. అయితే, రెండు డోసుల టీకా తీసుకున్న వారిని సైతం వైరస్ ఇలా అటాక్‌ చేయడం ఏంటన్నదే అంతుబట్టడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story