కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేసింది.. డిసెంబర్ 25 నుంచి..
కరోనా వచ్చిన దగ్గరనుంచి వ్యాక్సిన్ ఎప్పడొస్తుందా అని ఎదురు చూసిన ప్రజలకు శుభవార్త. యూకేలో ఇప్పటికే మొదలైన టీకా పండుగ మనదేశంలోనూ డిసెంబరు 25న ప్రారంభం కాబోతోంది. ఆ రోజే వాజ్పేయి జయంతి కూడా కావడం విశేషం. ప్రధాని నరేంద్ర మోదీ టీకా కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలకు తెలియజేసింది. తొలిదశలో వైద్య సిబ్బందికి, ఆరోగ్య కార్యకర్తలకు అందిస్తామని తెలిపింది. ఆ తర్వాత నుంచి సామాన్య ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కోవిడ్ టీకా కార్యక్రమ ఏర్పాట్లను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్రాల అధికారులకు సూచించింది.
వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతులు కోరుతూ నాలుగు రోజుల వ్యవధిలో భారత్ బయోటెక్, ఫైజర్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తులు సమర్పించిన సంగతి తెలిసిందే. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ పరిధిలోని కోవిడ్ 19 విషయ నిపుణుల కమిటీ ఈ మూడు విజ్ఞప్తులను బుధవారం పరిశీలించనుంది. ఈ దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుని త్వరలో ఏదో ఒక దానికి ఆమోద ముద్ర వేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com