రైతు పొలంలో భారీ వజ్రం..
ఓ రైతు పొలంలో దొరికిన భారీ వజ్రం జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలో చేసిన ప్రకటనకు బలం చేరూర్చింది. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలానికి చెందిన ఓ రైతు పొలంలో భారీ పరిమాణంలో వజ్రం దొరికింది. అతడు చదువుకున్న వ్యక్తి కావడంతో ఆ రాయిని హైదరాబాద్ ల్యాబ్లో పరీక్షలు చేయించాడు. అది వజ్రమే అని తేలినా సంతృప్తి చెందక వజ్ర నిక్షేపాలపై అధ్యయనం చేసిన ప్రొఫెసర్కు చూపించాడు. ఆయన కూడా దాన్ని వజ్రమని నిర్ధారించారు.
ఆ విషయం బయటకు వస్తే ఎక్కడ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందో అని భావించిన రైతు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ ఆ విషయం ఆనోటా ఈ నోటా పాకి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు శతాబ్దాల క్రిందటే మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తిలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు చారిత్రక ఆధారాలు దొకడంతో జియలాజికల్ సర్వే వాళ్లు పదేళ్ల పాటు పరిశోధనలు చేశారు. వారి సర్వేలో ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో వజ్రాలు, బంగారానికి సంబంధించిన నిక్షేపాలు ఉన్నాయని తేలింది.
దీనిపై ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన జియో ఫిజిక్స్ విభాగం ఫ్రోఫెసర్లు కూడా అధ్యయనం చేశారు. వారి పరిశోధనలో నల్లగొండ జిల్లాలోని రామడుగు, చండూరు, గుర్రంపోడు ప్రాంతాలతో పాటు మిర్యాలగూడ సమీపంలోని ఉట్లపల్లి తదితర ప్రాంతాల్లోనూ వజ్రా నిక్షేపాలు ఉన్నాయని తేల్చారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com