అంకుల్ ఎంత మంచి వారు.. పది రూపాయల పండుకి పదివేలిచ్చి..

అంకుల్ ఎంత మంచి వారు.. పది రూపాయల పండుకి పదివేలిచ్చి..
మన సాయం మరొకరి భవిష్యత్‌ని నిర్థేశిస్తుందంటే అంతకంటే ఆనందం ఏం ఉంటుంది.

మన సాయం మరొకరి భవిష్యత్‌ని నిర్థేశిస్తుందంటే అంతకంటే ఆనందం ఏం ఉంటుంది. ఆమె పరిస్థితి విని అందరిలా అయ్యో పాపం అనలేదు.. ఆ పని నేనే ఎందుకు చేయకూడదు అనుకున్నారు. ఆ చిన్నారిని వెతుక్కుంటూ వెళ్లి సాయం చేశారు ముంబైకి చెందిన వ్యాపార వేత్త. సాయం చేసిన అంకుల్‌కి చేతులెత్తి నమస్కరించింది. కన్నీళ్లతోనే క‌తజ్ఞతలు తెలిపింది తులసి.

జార్ఖండ్‌కు చెందిన 11 ఏళ్ల తులసి అయిదవ తరగతి చదువుతోంది. లాక్డౌన్‌తో బడులు మూతబడ్డాయి. అందరూ ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారు. తులసి తండ్రికి స్మార్ట్‌ఫొన్ కొనే స్థోమత లేదు. చదువుకోవాలన్న ఆశను చంపుకోలేని తులసి మామిడి పండ్లమ్మి వచ్చిన డబ్బుతో ఫోన్ కొనుక్కుని అందరిలా ఆన్‌తరగతులకు హాజరవ్వాలనుకుంది. చిన్నారి కథను ఓ పుణ్యాత్ముడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముంబయికి చెందిన వ్యాపారవేత్త హమేయా హెటె ఆ వార్తని చదివారు. అతడి మనసు చలించి పోయింది.

ఆర్టికల్ పోస్ట్ చేసిన వార్తా సంస్థ సాయంతో జార్ఖండ్‌లో ఉన్న ఆ చిన్న గ్రామానికి బయలుదేరారు. ఎట్టకేలకు రోడ్డు పక్కన కూర్చుని మామిడిపండ్లు అమ్ముతున్న తులసి దగ్గరకు చేరుకున్నారు. ఆమె దగ్గర ఉన్న 12 మామిడి పండ్లకు రూ.1,20,000లు అంటే ఒక్కో మామిడి పండు రూ.10,000లు చెల్లించి కొనుగోలు చేశారు. ఈ డబ్బును తులసి తండ్రి శ్రీమల్ కుమార్ ఖాతాకు బదిలీ చేశారు. దాంతో పాటు రూ.13వేల రూపాయల విలువ చేసే స్మార్ట్‌ఫోన్, సంవత్సరానికి సరిపడా ఇంటర్నెట్ రీ ఛార్జిని ఇచ్చారు. ఆమెకి ఇప్పుడు చదువుకోవడానికి ఏ ఆటంకమూ లేదని తులసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

"తులసి చాలా తెలివైన అమ్మాయి. కష్టపడి పనిచేసే విద్యార్థి. మేము ఇచ్చిన సహాయంతో ఆమె తన విద్యను పూర్తి చేస్తే మాకు చాలా సంతోషం. ఆమెకు అవసరమైనప్పుడుసహాయం చేస్తుంటాము "అని హమేయా హేటె అన్నారు.

కరోనావైరస్ భారతదేశంలో డిజిటల్ వ్యవస్థను తీవ్రతరం చేసింది. గత ఏడాది చెన్నైకి చెందిన ఒక బాలుడు స్మార్ట్ ఫోన్ దొంగిలించి పట్టుబడ్డాడు. పోలీసుల ఎంక్వైరీలో తన దగ్గర పాఠాలు వినడానికి ఫోన్ లేదని చెప్పడంతో ఇన్స్పెక్టర్ అతడికి ఫోన్ బహుమతిగా ఇచ్చి పాఠాలు శ్రద్ధగా వినమని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story