Bengaluru: 6 నెలలు.. 16 సర్జరీలు.. మొహంపై 8 కేజీల ట్యూమర్..
Bengaluru: ఏదైనా ఆరోగ్య సమస్య వల్ల ఒక్క సర్జరీ చేయించుకోవాలంటేనే వణికిపోతారు కొందరు. ఈ 3జీ కాలంలో ట్యూమర్ అనేది రకరకాలుగా మనిషిని బాధించడం మొదలుపెట్టింది. బ్రెయిన్ ట్యూమర్, క్యాన్సర్ లాంటి ట్యూమర్స్ గురించి మనం సాధారణంగా వినే ఉంటాం. కానీ మొహం మీద వచ్చిన ట్యూమర్ గురించి ఎప్పుడైనా విన్నామా? లేదు కదా.. బెంగుళూరులోని ఒక హాస్పటల్లో ఓ వ్యక్తికి మొహంపై ఉన్న 8 కేజీల ట్యూమర్ను 16 సర్జరీలు చేసి తీసేసారు డాక్టర్లు. అంతే కాక ఇంత పెద్ద సర్జరీని సక్సెస్ఫుల్గా పూర్తిచేసి తనను బతికించారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశాలోని తితిలాఘడ్ ప్రాంతానికి చెందిన మన్భోధ్ బాగ్ అనే వ్యక్తి చిన్నప్పటి నుండి ప్లెక్సిఫార్మ్ న్యూరోఫిబ్రోమా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు. దీని కారణంగా తనకు మొహంపై ట్యూమర్ ఏర్పడింది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ట్యూమర్ మరింత పెరగడం మొదలయింది. దాని వల్ల తాను ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కున్నాడు. ట్యూమర్ నుండి విముక్తి కోసం సిటీలోని ఒక హాస్పటల్కు వెళ్లాడు. కానీ ఆ ట్యూమర్ పోవడానికి సర్జరీ చేస్తే బాగ్ బతికే అవకాశాలు చాలా తక్కువ అని అక్కడి డాక్టర్లు వెల్లడించారు. దీంతో సర్జరీకి తాను ఒప్పుకోలేదు.
బెంగళూరులోని ఒక హాస్పటల్లోని వైద్యులు ట్యూమర్ను తొలగించడంతో పాటు తన ప్రాణాలకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. దానికి బాగ్ ఒప్పుకున్నాడు. పలు డిపార్ట్మెంట్లలోని వైద్యులంతా కలిసి బాగ్కు ఆరు నెలల్లో 16 సర్జరీలు చేసారు. సర్జరీల వల్ల తన ఫేస్ అంతా మారిపోవడంతో దానిని మళ్లీ మామూలు స్థితికి తీసుకురావడానికి వారు మరొక సర్జరీని నిర్వహించారు. వీటన్నింటికి మొత్తం రూ. 72.73 లక్షలు ఖర్చు అవ్వగా ప్రపంచవ్యాప్తంగా 8,700 డోనర్లు కలిసి ఈ డబ్బును ఫండ్గా బాగ్కు అందించారు. ఇలాంటి అరుదైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు కూడా మనోధైర్యంతో ఉండడం ముఖ్యం అని వైద్యులు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com